BRS Party Updates(Political news today telangana) :బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ముదురుతోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ రావుల మధ్య వర్గపోరు సాగుతోంది. బోనాలు ఫ్లెక్సీ వివాదం మరో మలుపు తిరిగింది. TSEWIDS ఛైర్మన్ రావుల శ్రీధర్రెడ్డిపై కార్పొరేటర్ దేదీప్యారావు ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం రావుల అనుచరుడు గణేశ్పై.. మాగంటి అనుచరులు దాడి చేశారు. బోనాలు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకుండా రావుల ఫోటో పెట్టినందుకు.. ఆయన అనుచరుడు గణేష్ పై మాగంటి అనుచరులు దాడి చేసిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. గణేష్ కంప్లైంట్ తో మాగంటి పీఏపై పోలీసులు కేసు పెట్టారు. లేటెస్ట్గా రావుల శ్రీధర్రెడ్డిపై కార్పొరేటర్ దేదీప్యారావు కేసు పెట్టారు.
ఈనెల 16న బోనాల ఉత్సవాల్లో శ్రీధర్ రెడ్డికి దేదీప్యరావుకు మధ్య వాగ్వాదం జరిగింది. తనకు సమాచారం ఇవ్వకుండా రావడంపై కార్పొరేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించాడంటూ దేదీప్యారావు ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో రావుల శ్రీధర్రెడ్డిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఐపిసి 506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ నాయకుల మధ్య ఆధిపత్య పోరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. సంయమనం పాటించాలని ఇరువురు నేతలకు వార్నింగ్ ఇచ్చారు.