akbaruddin owaisi : ఎంఐఎం లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలు ఆయనపై నమోదు చేశారు పోలీసులు. ఇన్ స్పెక్టర్ శివ చంద్ర ను దుర్బాషలాడారని పేర్కొంటూ..సెక్షన్ 353,153(a), 506, 505(2), 125 కింద హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ వివరాలను డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.
లలితాబాగ్లో మంగళవారం రాత్రి అక్బరుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ప్రచారం ముగించాలని ఎస్ఐ శివచంద్ర కోరారు. దీంతో సదరు పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు.
అంతేకాదు తనను ఆపేవాళ్లు ఇంకా పుట్టలేదంటూ అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలైనా సరా ఇంకా ధైర్యమే ఉందన్నారు. తాను ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్నవారు పరిగెత్తిస్తారంటూ ఎస్ఐకు అక్బరుద్దీన్ వార్నింగ్ ఇచ్చారు.
అక్బరుద్దీన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్బరుద్దీన్ తీరుపై బీజేపీ మండిపడింది. ఎంఐఎం నేర సంస్థగా మారిందని ఆరోపించింది. ఓల్డ్ సిటీని నిర్వీర్యం చేసిందని విమర్శించింది. బీజేపీ ప్రభుత్వంలో అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ తో ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ విభాగం వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసింది.