Suryapet Road Accident today(Local news telangana) : సూర్యాపేటలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం క్రాస్ రోడ్డు ఫ్లై ఓవర్ పై జరిగిన ఈ యాక్సిడెంట్లో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పాతికేళ్ల వయసువాళ్లే. చేతికి అందివచ్చిన కొడుకులు విగతజీవులుగా కనిపించడంతో.. ఆ తల్లిదండ్రుల జీవితాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Also Read : వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీ కొన్న కారు
యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మరో యువకుడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నవీద్ అనే యువకుడు రంజాన్ సందర్బంగా తన స్నేహితులకు విందు ఏర్పాటు చేశాడు. భోజనం చేసి తిరిగి హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్తుండగా.. సూర్యాపేట – ఖమ్మం ఫ్లై ఓవర్ పై డీసీపీఎం ను ఢీ కొట్టారు. మృతులు నిఖిల్ రెడ్డి(26), మహ్మద్ నవీద్(25), రాకేశ్(25)లుగా గుర్తించారు. వీరిలో నవీద్ కొద్దిరోజుల్లో న్యూజిలాండ్ కు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరగడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.