Hit And Run Case in Hyd(Telangana news updates): హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసులు కామన్ గా మారాయి. రోజురోజుకు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ బైకులతో యువకులు రయ్ మంటూ దూసుకెళుతూ ఇతర వాహనాలను ఢీకొడుతున్నారు. కొన్ని ఘటనల్లో ఓవర్ స్పీడ్ తో బైకులు నడుపుతూ వారే ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ మధ్య కార్లు ఓవర్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా కార్లు నడుపుతూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు భాగ్యనగరంలో నిత్యకృత్యంగా మారాయి. తాజాగా హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగుచూసింది.
గురువారం వేకువ జామున బొల్లారం ఏరియాలో ఓ డాక్టర్ ఓవర్ స్పీడ్ తో కారు నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు. ఆ వైద్యుడు కారుతో రోడ్డు పక్కన ఉన్న తోపుడుబండ్లను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. కారును వెంబడించి ఆ డాక్టర్ ను పట్టుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న న్యూరోసర్జన్ గా గుర్తించారు.
Read More: మిషన్ భగీరథపై సీఎం రేవంత్ ఫోకస్.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష
బొల్లారంలో జరిగిన ఈ కారు ప్రమాదంలో సయ్యద్ పాషా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రుడికి తన ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందిస్తానని చెప్పి పాషాను ఆ వైద్యుడు తన కారులో తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడి అసలు రూపం బయటపడింది.
అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ లో బాధితుడిని ఆ వైద్యుడు చేర్పించాడు. ఆ తర్వాత ఆ డాక్టర్ ఆస్పత్రి నుంచి జంప్ అయ్యాడు. క్షతగాత్రుడు సయ్యద్ పాషా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆస్పత్రిలో బిల్లులు చెల్లించలేకపోతున్నామని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.