Master Plans : కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్స్ తెలంగాణలో పెనుదుమారం రేపాయి. రైతుల ఆందోళనతో ఈ రెండు పట్టణాలు అట్టుడికాయి. జగిత్యాలలో నలువైపులా రోడ్లను దిగ్భందించి రైతులు నిరసన తెలిపారు. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం అక్కడకి వెళ్లలేకపోయారు. కామారెడ్డిలో అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అక్కడా రైతులు ఆందోళన చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని పట్టుబట్టారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయో లేక రైతుల ఆవేదన అర్ధం చేసుకున్నారో గానీ ఆ మాస్టర్ ప్లాన్స్ ను కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్స్ రద్దు చేశాయి.
జగిత్యాల మాస్టర్ ఫ్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్లు పాలకవర్గం ప్రకటించింది. ఇక్కడ మాస్టర్ ఫ్లాన్ రద్దు చేయాలని కోరుతూ వారం రోజులుగా 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. డిసెంబర్ 15న మాస్టర్ ఫ్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. రైతుల నిరసనలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాస్టర్ ఫ్లాన్ సవరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ లో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
మరోవైపు అత్యవసరంగా సమావేశమైన కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఛైర్ పర్సన్ , వైస్ ఛైర్మన్ తో కలిపి మొత్తం 49 వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్లు ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పై స్పష్టత కోసమే అత్యవసర సమావేశం నిర్వహించామని తెలిపారు. వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. డిజైన్ డెవలప్మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు. రైతులకు అండగా ఉంటామన్నారు. గతంలో రైతుల నుంచి 60 రోజులపాటు అభ్యంతరాలు తీసుకున్నామన్నారు. వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీయల్ జోన్ చేయమన్నారు. రైతులు ఆందోళన విరమించాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జహ్నవి కోరారు.