Congress news telangana(Latest political news telangana): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇటీవలే ప్రచార కమిటీని ప్రకటించిన హైకమాండ్.. ఇప్పుడు ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఎలక్షన్ కమిటీకి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. మొత్తం 26 మందికి ఎన్నికల కమిటీలో చోటు దక్కింది. కమిటీలో యూత్ కాంగ్రెస్, NSUI అధ్యక్షులు, సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ను ఎక్స్అఫిషియో సభ్యులుగా అధిష్టానం నియమించింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందుకోసం అవసరమైన కసరత్తు వేగవంతం చేస్తోంది. నవంబర్లోనే నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే మరో నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. అంటే కరెక్ట్గా ఇంకో హండ్రెడ్ డేస్లో గోల్ రీచ్ అవ్వాలి. దానికి తగ్గట్టుగా బహుముఖ వ్యూహంతో హస్తం పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు అధికార పక్షాన్ని గట్టిగా ఢీకొడుతునే మరోవైపు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కర్ణాటక తరహా వ్యూహాలను రచించి అమలు చేస్తోంది. ఓవైపు చేరికలు, మరోవైపు సర్కార్పై పోరాటం, ఇంకోవైపు ప్రజల్లో మమేకం కావడం.. వీటన్నింటితో పాటు నేతల మధ్య ఐక్యతకు పాటు పడుతోంది. అందుకు అనుగుణంగానే అధిష్టానం కూడా నిర్ణయాలు చకచకా తీసుకుంటోంది. కీలక బాధ్యతలను నేతలకు అప్పగిస్తూ నిర్ణయాలు వెలువరిస్తోంది. ఐదురోజుల క్రితం ప్రచార కమిటీని ప్రకటించిన హైకమాండ్ తాజాగా ఎన్నికల కమిటీని ఖరారు చేసింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల కమిటీకి ఛైర్మన్గా ఉంటారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టి.జీవన్రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, యధుయాష్కి గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొదెం వీరయ్య, సీతక్క, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, సునీతారావ్ ముదిరాజ్తో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్లతో పాటు యూత్ కాంగ్రెస్, NSUI అధ్యక్షులు, సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ను ఎక్స్ అఫిషియో సభ్యులుగా అధిష్టానం నియమించింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అసెంబ్లీ ఎలక్షన్స్ను ఫేస్ చేయడానికి మరింత వేగం పెంచనుంది.
ఇటీవలే ప్రచార కమిటీ పదవులను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఛైర్మన్గా మధుయాష్కీ గౌడ్, కో చైర్మన్గా పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని నియమించింది. కన్వీనర్గా సయ్యద్ అహ్మతుల్లా హుస్సేన్ నియమితులయ్యారు. ప్రచార కమిటీతో పాటు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల అబ్జర్వర్లను నియమిస్తూ AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గత వారం ఉత్తర్వులిచ్చారు. వాళ్లతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను అధిష్టానం నియమించింది. ఈ రెండు టీమ్ల నియామకం కావడంతో క్షేత్రస్థాయిలో హస్తం పార్టీ మరింత దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దగ్గర్నుంచి ప్రచార వ్యూహాలు.. మేనిఫెస్టో రూపకల్పన తదితర విషయాల్లో స్పీడ్ పెరగనుంది. సెప్టెంబర్ 17న తొలివిడత మేనిఫెస్టో ప్రకటిస్తామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు.
రాహుల్ జోడో యాత్ర స్ఫూర్తితో నేతలు ఎక్కడికక్కడ పాదయాత్రలు నిర్వహించారు. ఇప్పుడు మరోసారి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 23న రాజకీయ వ్యవహారాల కమిటీ-PACలో చర్చించి బస్సుయాత్రపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ భేటీ తర్వాత మేనిఫెస్టో కమిటీని ప్రకటించనున్నారు. అలాగే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. లక్ష రుణమాఫీ ఏమైందని బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. 24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందనే అంశాన్ని ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు. అలాగే గ్యారెంటీ స్కీంలు కూడా ప్రజల్లోకి చేర్చేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.