Cag report: రాష్ట్ర స్థితిగతులపై కాగ్ తాజాగా నివేదికను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీలో 2023 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించిన రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్ డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని కాగ్ పేర్కొన్నది.
కాగ్ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.. ‘రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం వరకు పెరిగాయి. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం మేర తగ్గింది. సొంత పన్నుల రాబడి కూడా గణనీయంగా 17 శాతం పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 2,06,977 కోట్లకు పెరిగింది. మార్చి 2023 నాటికి పూర్తి కావాల్సినటువంటి 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది.
Also Read: త్వరలో స్పోర్ట్స్ పాలసీ, ఆటలపై మా దృష్టి-సీఎం రేవంత్
రూ. 2,749 కోట్ల వరకు ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారు. 2022-2023లో ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలు, అడ్వాన్స్ లు 150 శాతం మేర పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలను ఏర్పాటు చేసింది. 2022-2023 బడ్జెట్ వెలుపలి రుణాలు రూ. 1,18,629 కోట్లుగా అంచనాగా ఉంది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ. 17,829 కోట్ల వరకు అందించింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు రాలేదు. గొర్రెల పంపిణీ, ఇళ్ల పంపిణీ, ఆయిల్ పామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదు. దళితబంధుతోపాటు రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదు’ అంటూ కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.