White Ration Cards: రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేస్తామంటూ కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన విధివిధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో కొత్త రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదరరాజ నరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు.
తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం రూ. లక్షన్నర లోపు, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు.. అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘం ముందుకు వచ్చిందని ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు విషయంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
తక్షణమే రాజ్యసభ, లోకసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధివిధినాలలో వారివారి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి చౌహాన్ కు మంత్రి సూచించారు. అంతేకాకుండా సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు దిగువ, పేద, మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డుల మంజూరు విషయంలో అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Also Read: రాఖీ పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం
అయితే, అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చినవారికి అక్కడ, ఇక్కడ.. రెండు చోట్లా తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి అక్కడో.. ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై కూడా చర్చించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో అదనపు సభ్యులను చేర్చాలంటూ వచ్చిన దరఖాస్తుల సంఖ్య 11 లక్షల 33 వేల 881 అని మంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 956.04 కోట్లు ఖర్చవుతుందన్నారు.