Gitam University: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు గీతం యూనివర్సిటీలో.. రేణుశ్రీ(18) అనే విద్యార్థిని కాలేజీ ఐదంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గీతం యూనివర్సిటలో రేణుశ్రీ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కూకట్ పల్లిలో ఉంటున్నారు. ఆమె భవనం పై నుంచి వెక్కివెక్కి ఏడుస్తూ.. భయపడుతూ దూకిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. వీడియో తీసే బదులుగా ఎమర్జెన్సీ అలారంను మోగిస్తే.. ఆమె బ్రతికి ఉండేదేమో కదా అని.. వీడియో తీసిన వారిని తిట్టిపోస్తున్నారు.
రేణుశ్రీ మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఇస్నాపూర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అక్కడి నుంచి పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం ఏపీలోని ఏలూరులో ఉన్న స్వగృహానికి విద్యార్థిని మృతదేహాన్ని తీసుకువెళ్ళారు. అటెండెన్స్ లో హాజరు శాతం తక్కువగా ఉండటంతో రేణుశ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయలేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. పరీక్షల ఒత్తిడితోనే ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.