Murder : పట్టపగలు హైదరాబాద్ లో దారణ హత్య జరిగింది. ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో ..ఒక వ్యక్తిని వెంటాడారు. ఒక్కసారిగా చుట్టిముట్టి నడిరోడ్డుపై నరికి చంపారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ దారుణం జరిగింది. జియాగూడ బైపాస్ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తుండగా.. అతన్ని మరో ముగ్గురు వెంటాడారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికేశారు.
కుల్సుంపుర పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడి ఆధార్ కార్డు ఆధారంగా కోఠి ఇస్తామియా బజార్కు చెందిన జంగం సాయినాథ్(32)గా గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని కుల్సుంపుర సీఐ అశోక్కుమార్ తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ముగ్గురు చుట్టుముట్టి ఒక వ్యక్తిని కిరాతకంగా నరుకుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసుల దర్యాప్తునకు ఈ వీడియో కీలకంగా మారింది.