BRS: మొన్న సీఎల్పీ నేత భట్టి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ కమిటీలపై భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. అది చూసిన వాళ్లంతా ఒకటే మాట. కాంగ్రెస్ లో ఇలాంటివి కామన్. ఎందుకంటే, అక్కడ అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ.
కట్ చేస్తే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో ఐదుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం. తమ అనుచరులకు పదవులు ఇవ్వకుండా అన్నీ మంత్రి మల్లారెడ్డి తమ వారికి ఇప్పించుకున్నారంటూ తిరుగుబాటు. ఇది చూసిన వాళ్లంతా షాక్. అదేంటి, కరుడుగట్టిన క్రమశిక్షణ ఉండే బీఆర్ఎస్ లో.. ఈ తిరుగుబాట్లు ఏంటి? ఇవి కేవలం మంత్రి మల్లారెడ్డిపైనేనా? లేదంటే, సీఎం కేసీఆర్ పైన కూడానా? ఎమ్మెల్యేలకు అంతటి స్వేచ్ఛ ఒక్కసారిగా ఎలా వచ్చినట్టు? ఏదైనా సమస్య ఉంటే కేసీఆర్ కో, కేటీఆర్ కో చెప్పాలి కానీ.. ఇలా రెబెల్ మీటింగ్స్ పెట్టుకోవడం.. మీడియా ముందుకు రావడం.. బీఆర్ఎస్ లో ఈమధ్య కాలంలో ఎవరూ చూసుండరు. అందుకే, ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
గులాబీ బాస్ ఇలాంటివి సహించరు. పార్టీ అన్నా, ప్రభుత్వం అన్నా.. తానొక్కడినేనని.. మిగతా వాళ్లంతా కేవలం హెడ్ కౌంట్ కోసమే అనేది ఆయన విధానం అనే విమర్శ ఉంది. సీఎం కేసీఆర్ ఏ ఒక్కరినీ కలవరు.. ఆయన్ను ఎవరూ కలవలేరు.. అంటుంటారు. మరి, ఏదైనా విషయం ఉంటే ఆయనకు చెప్పడం ఎలా? మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేయాలంటే ప్రగతి భవన్ లోకి నో ఎంట్రీనాయే. అందుకే, మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు ఇలా రెబెల్ జెండా ఎగరేశారని అంటున్నారు. అయితే, ఇలాంటి చర్యలను సీఎం కేసీఆర్ తట్టుకోగలరా? అనేదే క్వశ్చన్.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరో గట్టి సంకేతమే ఇచ్చారు. కొంత మంది మూర్ఖుల వల్ల పార్టీకి నష్టమంటూ మంత్రి మల్లారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు మెసేజ్ ఇస్తున్నాం.. అని కూడా అన్నారు. కేటీఆర్ ను కలవాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
కేసీఆర్ కే మీడియా ముఖంగా మెసేజ్ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పరోక్షంగా కేసీఆర్ పైనే తిరుగుబాటా? ఆయన తీరుపై అసంతృప్తా? ఎమ్మెల్యేలకు కొత్తగా ధైర్యం వచ్చిందా? ఏళ్ల పాటు కేసీఆర్ ను కలిసే ఛాన్స్ రాకపోవడంతో ఇలా తెగింపు మొదలుపెట్టారా? మంత్రినే విమర్శిస్తే.. అది పరోక్షంగా పార్టీని డ్యామేజ్ చేయదా? కేసీఆర్, కేటీఆర్ లను కాదని.. ఐదుగురు ఎమ్మెల్యేలు కలిసి వేరు కుంపటిలా మీటింగ్ పెట్టుకోవడం.. కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యాన్ని ధిక్కరించడం కాదా? తెగిస్తే పోయేదేమీ లేదని ఎమ్మెల్యేలు భావించారా? ఇదే బాటలో జిల్లాల వారీగా మరింత మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారే గ్రూపులు కడితే పార్టీ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో అయితే టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టంగా ఉంది కాబట్టి.. ఎమ్మెల్యేలంతా కుక్కిన పేనులా పడి ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండటం.. బీజేపీ దూసుకుపోతుండటం.. కాంగ్రెస్ సైతం కాక మీదుండటంతో.. ప్రస్తుత ట్రయాంగిల్ హోరాహోరీ ఫైట్ లో.. ఎమ్మెల్యేలకు పొలిటికల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని.. ఇకపై నేతలు మునుపటిలా అన్నిటికీ నోరు మూసుకుని పడుండే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు. అందుకే, ఎప్పుడూలేని విధంగా.. ఐదుగురు ఎమ్మెల్యేలు జట్టు కట్టి.. మంత్రిపై బహిరంగంగా తిరుగుబాటు చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ లోనూ కాంగ్రెస్ తరహా కల్చర్ స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు. మరి, కేసీఆర్.. ఈ ఇష్యూను ఎలా డీల్ చేస్తారు? తనకు చెప్పకుండా ఇలా మీడియాకు ఎక్కడాన్ని అనుమతిస్తారా? అణచివేస్తారా?