BRS : భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు సమయంలో ఉన్న జోష్ పార్టీలో ఇప్పుడు కనిపించడంలేదని మాటలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కూడా చురుగ్గా సాగడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటు తెలంగాణలోగానీ, అటు ఢిల్లీలో గానీ కారు హారన్ మోగడంలేదని టాక్. ఈ మధ్య ఏపీలో కొందరు నేతలను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహిస్తారని టాక్ వినిపించింది. విజయవాడలోగానీ, గుంటూరులోగానీ ఈ సభ ఉంటుందని వార్తలు వచ్చాయి. పార్టీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ వేదికపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
అతిథిలు వీరే..!
ఈ నెల 18న ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను ఆహ్వానించారు. కేజ్రీవాల్, భగవంత్మాన్, అఖిలేష్ ఈ సభకు వస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ 18న ఖమ్మం కలెక్టరేట్ను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని 100 ఎకరాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ సభ కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. లక్ష మందికి పైగా జనం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మంతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మంలోనే ఎందుకంటే..?
ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించడానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఛత్తీస్గఢ్లోనూ బీఆర్ఎస్ పార్టీ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కేసీఆర్. అలాగే ఈ జిల్లాలో వామపక్షాలకు బలం ఉంది. ఇటీవలి మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలున్నాయి. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మంలో ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఖమ్మం సభ తర్వాత పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారని సమాచారం.
తెలంగాణ సచివాలయాన్ని ఈ నెల 18న ప్రారంభించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో ఆరోజు సచివాలయ ప్రారంభోత్సవం లేదని తేలిపోయింది. మరోవైపు ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించనున్నారు. మొత్తంమీద కారును నేషనల్ హైవే పై దూసుకెళ్లేలా కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. మరి కారు స్పీడందుకుంటుందా? చూడాలి.