KCR Political Activities: కారు పార్టీ బాస్ కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారా? రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది సందర్భంగా కొత్త స్కెచ్ వేస్తున్నారా? ఆ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోందా? అందుకోసమే డిసెంబర్ను ఎంచుకున్నారా? నేతల ద్వారా కేడర్ ఏమని సంకేతాలు ఇచ్చారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి డిసెంబర్ నాటికి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు కేసీఆర్. తనను కలిసిన నేతలకు ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది.
డిసెంబర్ నాటికి కేడర్ని సిద్ధం చేయాలని సంకేతాలు ఇచ్చారట పెద్దాయన. ఉన్నట్లుండి కారు బాస్ సంకేతాల వెనుక అసలేం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కారు పార్టీ నేతలు, కేడర్ డీలా పడి పోయారు. ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నేతలున్నా కేవలం టీవీకి మాత్రమే పరిమితం అయ్యారన్న వాదన బలంగా ఆ పార్టీ కేడర్లో ఉంది.
దీన్ని పసి గట్టారు గులాబీ బాస్. దీనికితోడు ముఖ్యనేతలు.. కేసీఆర్పై ఒత్తిడి చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లకుంటే పార్టీ ఆదరణ పోతోందని అంటున్నారట. పట్టు తప్పే పరిస్థితి పొంచి వుందని చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. మార్నింగ్ వాకర్స్పై దాడి
ఓ వైపు నేతల ఒత్తిడితో డిసెంబర్ నుంచి ప్రజల వద్దకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. మునుపటి మాదిరిగా కేసీఆర్ వాయిస్ లేదు. ఎన్నికల సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ వాయిస్లో వేడి మందగించింది. ఆ తరహా స్పీచ్ లేకుంటే కష్టమని అంటున్నారు.
కేసీఆర్ బస్సు టూర్కు దూరంగా ఉండాలన్నది కొందరి మాజీల ఆలోచన. ఇప్పుటి నుంచే చేయడం కరెక్ట్ కాదని, ఎన్నికలు ఏడాది ఉందనగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందనే చర్చ మరోవైపు వినిపిస్తోంది. ప్రజలను కలిసి కేసీఆర్ వస్తారా? త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు సమయాత్తం చేయనున్నారా? అనే దానిపై ఆ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇంకెన్ని వార్తలు వస్తాయో చూడాలి.