– ఇది పిరికిపంద పాలన
– రైతులకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం
– ధర్నాలు చేస్తుంటే దాడులు చేస్తారా?
– పొంగులేటి ఇల్లు కూల్చాకే సామాన్యుల జోలికి వెళ్లాలి
– ఇవాళ మహిళా కమిషన్ ముందుకు వెళ్తా
– డీజీపీని కలిసి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
– తిరుమలగిరి ఘటనపై ఫిర్యాదు
KTR: రుణమాఫీ పేరుతో రైతుల్ని ప్రభుత్వం నిండా ముంచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర డీజీపీని కలిశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఘటనపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మేం తలుచుకుంటే ఒక్కరు కూడా ఉండరు
డీజీపీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు కేటీఆర్. రైతు రుణమాఫీ పేరిట ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ధర్నాలు చేసిందని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో శాంతియుతంగా రైతులతో కలిసి ధర్నా చేస్తుంటే, 50 మంది కాంగ్రెస్ గూండాలు గుడ్లు, చెప్పులు, బాంబులు విసిరారని ఆరోపించారు. తాము తిరగబడితే కాంగ్రెస్ వాళ్లు ఒక్కరు కూడా ఉండరని హెచ్చరించారు.
ఇదేం ప్రభుత్వం
రాష్ట్రంలో పిరికిపంద పాలన నడుస్తోందని, రైతులకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఉందని విమర్శించారు కేటీఆర్. గల్లీలో తిరగాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీలో తిరుగుతున్నారని, రేవంత్ రెడ్డి సొంత ఊరిలో రైతు రుణమాఫీ అయిందా లేదా అని అడుగుతుంటే మహిళా జర్నలిస్టుల పైనా దాడులు చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వికృతమైన భాష మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని, రుణమాఫీ ఎక్కడ జరిగిందో అడగుదామని సవాల్ చేశారు.
పోలీసుల అత్యుత్సాహం
అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదన్నారు కేటీఆర్. రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. తిరుమలగిరి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేతలపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయన్నారు. ఈ నగరానికి ఏమైందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, పోలీసులు మంత్రుల పుట్టిన రోజు వేడుకల్లో పరవశించి పోతున్నారని విమర్శించారు. అంతేకాదు, డ్యాన్సులు కూడా వేస్తున్నారని అన్నారు.
Also Read: Harishrao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. అందులో ఏం రాశారంటే..?
మహిళా కమిషన్ ముందుకెళ్తా
ఈమధ్య రాష్ట్ర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆర్టీసీ బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణపై క్లారిటీ ఇచ్చారు. ఇవాళ మహిళా కమిషన్ విచారణకు హాజరు అవుతున్నట్టు చెప్పారు. కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు వెళ్తున్నట్టు తెలిపారు.
పొంగులేటి ఇల్లు కూల్చాల్సిందే!
నిబంధనలకు విరుద్ధంగా పొంగులేటి ఇల్లు ఉందన్నారు కేటీఆర్. ఎఫ్టీఎల్ పరిధిలో ఆయన తమ్ముడి ఫాంహౌస్ ఉందో, లేదో రంగనాథ్ను అడిగితే ఆయనే చెప్తారని తెలిపారు. మొదట ఆయన ఫాంహౌస్ కులగొట్టిన తరువాతనే సామాన్యుల ఇండ్ల జోలికి వెళ్లాలన్నారు. అలాగే, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్ర రావు, పల్లం రాజు ఫాంహౌస్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని చెప్పారు.