BRS Office in Delhi(BRS Party Latest News) : దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. సరిగ్గా మధ్యాహ్నం 1.05 గంటలకు ఈ ఆఫీస్ ను కేసీఆర్ ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగరవేశారు. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి బీఆర్ఎస్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారు. సీఎం 2 రోజులు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. వివిధ విపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులతో సమావేశమవుతారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భవనానికి సంబంధించిన కొన్ని పనులు తుది దశలో ఉన్నాయని, 10 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రశాంత్రెడ్డి తెలిపారు. దేశ రాజధానిలో త్వరలో తెలంగాణ భవన్ను నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తులుగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో కేసీఆర్ ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫెరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు.
2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములున్నాయి. ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ మినహా మిగతా 18 రూమ్స్ నేతలకు అందుబాటులో ఉంటాయి.