BRS MP Candidates: బీఆర్ఎస్ పార్టీ మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవితను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు.
సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ఈ రెండు సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. కాగా ఆదివారం పెద్దపల్లి, కరీంనగర్ ఎంపీ స్థానాలకు కొప్పుల ఈశ్వర్, బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను ప్రకటించారు.
2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వర రావు 2014 లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన నామా బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.
Read More: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఇద్దరు పేర్లు ప్రకటించిన కేసీఆర్..
ఆ తరువాత గులాబీ గూటికి చేరిన నామా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. ప్రస్థుతం ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వర్ రావు కు కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. అటు ఎన్నికల్లో నిలబడటానికి నామా విముకత చూపించారని వార్తలు వినిపించాయి.
ప్రస్థుతం మహబూబాబాద్ ఎంపీగా ఉన్న మాలోతు కవితకు బీఆర్ఎస్ మరో అవకాశాన్నిచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన కవిత బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత హస్తం పార్టీని వీడి కారెక్కిన కవిత 2019 లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు.