తెలంగాణలో పదేళ్లుగా పాలకపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష స్థానంలో కూర్చోనుంది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు.
ఒక్కొక్కరిగా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు నేతలు. తుంటి ఎముక చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించనున్నారు. కేసీఆర్ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా ఈ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదించనున్నారు.
శాసనసభా పక్ష నేత ఎన్నిక అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశానికి బీఆర్ఎస్ సభ్యులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
శాసనసభలోని 119 మంది సభ్యులలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిన నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కనుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్రావు ఉంటారని ప్రచారం సాగింది. కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, హరీశ్రావుకు శాసనసభాపక్ష నేత పదవి ఇస్తారని బీఆర్ఎస్లో చర్చ కూడా సాగింది. కానీ బీఆర్ఎస్ తరఫున కేసీఆరే శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావించినట్లు సమాచారం.