BRS mlas stopped their migrations into congress party: ఆ మధ్య రంగస్థలం సినిమాలో ఓ పాపులర్ సాంగ్ ఉంది. ఆ పక్కకెళతావా నాగన్న ఈ పక్కనుంటావా? ఇప్పుడు తెలంగాణ రాజకీయ పరిస్థితి అలానే ఉంది. అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలలో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీనుంచి రెండు నెలల క్రితం నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వలసలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగేలోగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తర్వాత అదే ఊపు కొనసాగుతుందని భావించారంతా. కానీ పది మంది ఎమ్మెల్యేల చేరికల తర్వాత ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఈ విషయంలో కేసీఆర్ ఏమన్నా చక్రం తిప్పారా? లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారా అని చర్చ జరుగుతోంది.
వలసలపై తగ్గిన దృష్టి
అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ విదేశీ పర్యటనలు, వచ్చిన వెంటనే ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉండటంతో వలసల మీద ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ వలసల ప్రక్రియ ఉండనుుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయంలో కాస్త ధీమాగానే కనిపిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయలేదని ..ఇప్పుడు వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కేసులు పెడితే వీరి ఎమ్మెల్యే పదవులు ఊడిపోతాయి.
మరోసారి ఎన్నుకుంటారా?
మళ్లీ మరో ఆరునెలల్లోగా జరిగే ఉప ఎన్నికలలో గెలవాల్సి ఉంటుంది. తీరా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్లకు టిక్కెట్ ఇస్తుందో లేక సొంత పార్టీ నేతలనే నిలబెడుతుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సందిగ్ధంలో ఉండటమే బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చేఅంశంగా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా పార్టీ మారే ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. మళ్లీ మరోసారి ఎన్నికలలోకి వెళ్లాలంటే వీళ్లు భయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలై ఎనిమిది నెలలు కూడా కాకుండానే పార్టీ మారిపోతే మళ్లీ ప్రజలు వీళ్లను ఎన్నుకుంటారా లేక డిపాజిట్లు లేకుండా చేస్తారా అని సందేహిస్తున్నారు. ఈ మధ్య కేటీఆర్ సైతం ఢిల్లీ వెళ్లొచ్చారు. తర్వాత పార్టీ మారిన నేతలను హెచ్చరించారు.
భయపెడుతున్న ఫిరాయింపుల చట్టం
త్వరలోనే వారిపై ఫిరాయింపుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డారు. ఢిల్లీ నుంచి రాగానే రేవంత్ రెడ్డి మరోసారి చేరికలపై ఫోకస్ పెంచనున్నారని సమాచారం. ఎలాగైనా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రెండు సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో న్యాయనిపుణులతో ఫిరాయింపుల చట్టం మీద ఎలా ముందుకు వెళ్లాలి..ఇప్పుడున్న వలస నేతలను ఎలా నియంత్రించాలి అనే విషయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.తమ నేతలను బుజ్జగించి..దారికి రాకపోలే బెదిరించి ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. వలసలను ఆపగలిగితే భవిష్యత్ లో పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి పెడతారని భావిస్తున్నారు.