BRS : ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు..
బీఆర్ఎస్ కార్యకర్తని లోపలేస్తా బిడ్డా! అంటున్న పాలేరు ఎమ్మెల్యే..
తెలంగాణలో అధికార పార్టీలో ఎమ్మెల్యేల పిచ్చి పీక్స్ కి వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం మమ్మల్నెవడూ ఏమీ చేయలేడనే అహంకారం పై నుంచి కింది వరకు ఉండేది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అందరికీ వాస్తవం బోధపడుతోంది. కౌంట్ డౌన్ స్టార్టయిందని తెలిసింది. గాల్లో ఎగిరిన అందరూ ఒకొక్కరు ఠపీఠపీ మని కిందకి పడుతున్నారు. ఛాతీ విరుచుకుని భూమికి ఆరడుగుల ఎత్తులో నడిచే ఎమ్మెల్యేలు కూడా నెమ్మదిగా భూమ్మీదకు దిగుతున్నారు.
ఈ క్రమంలో తమ ప్రభావం అంతా పోతోంది. ఇక మేం ఓడిపోతున్నామని తెలుసుకున్న కొందరు ఎమ్మెల్యేలు ఎంతకైనా తెగిస్తున్నారు. వీరిలో ప్రథముడిగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ నిలుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడాన్ని జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే, అనుచరులు కలిసి తనపై దాడిచేసి చంపాలని చూశారని బాధితుడు కూర నరేష్ నారాయణపేట జిల్లా కోస్గీ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదైంది.
బాధితుడి కథనం ప్రకారం.. కొడంగల్ పట్నంలోని ఒక ఫంక్షన్ హాల్ లో దగ్గర వారి పెళ్లి పనులు చక్కబెట్టుకుని బైక్ పై ఇంటికి వెళుతున్నాను. ఆ సమయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, వెంకట నర్సింలు, మాకల రాజేష్, బాలేశ్, హిలీశ్రెడ్డి, సాయప్ప, అమీర్ షేక్, ఫసియోద్దీన్లు నా బైక్ను ఆపి కాంగ్రెస్కు మద్దతు ఇస్తావా అంటూ బూతులు తిట్టారు.
తర్వాత కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పారు. కారులోనే కర్రలు, రాళ్లతో రక్తం వచ్చేలా కొట్టారు. నాపై దౌర్జన్యం చేసి చంపే ప్రయత్నం చేశారని బాధితుడు కూర నరేశ్ వాపోయాడు. ఇదే విషయాన్ని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు నా దగ్గరున్న బంగారం, నగదు కూడా లాక్కున్నారని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిపై హత్యాయత్నంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అలాగే పాలేరు అధికార పార్టీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ కూడా ఫోన్ లో సొంత పార్టీ కార్యకర్తకు వార్నింగ్ ఇచ్చాడు. అదిప్పుడు వైరల్ అయ్యింది. ‘ఏం బిడ్డా నకరాల్ చేస్తున్నావా? లోపలేస్తా చూస్కో. ఏం తమాష చేస్తున్నావురా.. ’అని వార్నింగ్ ఇవ్వడం సంచలనమైంది.
దీంతో కార్యకర్త కూడా గట్టిగానే నిలబడ్డాడు. నేనేం తమాష చేస్తున్నా సార్, అంటూ ఎదురుతిరిగాడు. మీ మాట నమ్మి సర్పంచిగా పోటీ చేశాను. మీరే నిలబెట్టారు.. మీరే ఓడగొట్టారని మాట్లాడాడు. మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు. మీతో పాటు మేం వచ్చాం. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం సార్.. మేం అటే వెళ్లిపోతున్నాం…అని గట్టిగా తగులుకున్నాడు.దీంతో కందాలకు సౌండ్ లేకుండా పోయింది. ఎన్నికలకు మరో నాలుగు రోజులుందనగా ఈ పంచాయతీ ఏంట్రా బాబూ..అని ఆయన తలపట్టుకున్నారు.
మొత్తానికి రోజుకొక అరాచకాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నాయి. ఎన్నికల ముందు ఇంకెన్ని వస్తాయో, ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బరస్ట్ అవుతారో తెలీదని అంటున్నారు. ఇలా దాదాగిరి చేసే వారందరికీ కేసీఆర్ సీట్లు ఇచ్చారని, అందుకే తగిన శాస్తి జరుగుతుందని పబ్లిక్ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి మంట మొదలైంది. ఒకొక్కరికి సెగ తగులుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.