BRS MLA Support to Revanth Reddy in Moosi purge: మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు సైతం.. ప్రజలతో మమేకం అవుతూ.. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఒప్పించి.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్నా ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా బదులిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ ఫాం హౌసులు ఉంటే సొంత ఖర్చులతో కూల్చేయడానికి సిద్దం అంటున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్ గా పలువురు బీఆర్ఎస్ నేతలు తోచింది మాట్లాడేస్తున్న తరుణంలో.. సీఎం రేవంత్ చర్యలను స్వాగతిస్తున్నా అంటూ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారుతోంది.
మూసీ ప్రక్షాళన ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహిస్తూ అర్హుల వివరాలు సేకరిస్తోంది. అధికారులు సైతం.. ప్రజలతో మమేకం అవుతూ.. నదీ పరీవాహక ప్రాంత ప్రజలను ఒప్పించి.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. ఇచ్చిన మాట మేరకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించడం పట్ల.. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో మూసీ నది పరివాహక ప్రాంత రైతులతో సమావేశం కీలకంగా భావిస్తున్నారు. నాగోల్ శుభం గార్డెన్స్లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమీక్షకు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నను ఉద్దేశిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వాలు విస్మరించి మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరమన్నారు.
ప్రభుత్వం ఎస్టీపీ లతో మురికి నీరును శుద్ధి చేసి.. గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీని శుద్ధిచేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్
సీఎం రేవంత్కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ అక్రమని తేలితే సొంత ఖర్చుతో కూల్చేయానికి రెడీ అన్నారు. కాంగ్రెస్కు చెందిన వ్యక్తిని కాబట్టి తనకు ఎలాంటి మినహాయింపు వద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకూడదని లేఖలో కేవీపీ రాశారు.
FTL, బఫర్ జోన్లో తన ఫామ్ హౌజ్ ఉంటే..తానే నేరుగా కూల్చేస్తానన్నారు మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి. నిబంధనల ప్రకారమే తన ఫామ్ హౌజ్ నిర్మాణం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఒకవేళ ఆ నివేదిక తప్పు అయితే..తానే ఫామ్ హౌజ్ను కూల్చేస్తానన్నారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.
మూసీ సుందరీకరణ చేయాల్సిందేనన్నారు బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అయితే అందుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నా తరుణంలో కృష్ణారావు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణకు పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చేసినవి అప్పులు, తప్పులేనని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు.. ఫామ్హౌజ్లు కాపాడుకోవడానికే హైడ్రాకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారన్నారు.మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న పేదల కష్టం తనకు తెలుసని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే తనకు బాధగానే ఉందని చెప్పారు. కానీ హైదరాబాద్ బాగు కోసం ఎవరో ఒకరు నడుం కట్టాల్సిందేనని.. అందుకే తాను మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టానని తెలిపారు. పేదలకు ఏం చేయాలో ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే.. తాము స్వీకరిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
కూల్చివేతల్ని బూచిగా చూపి బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ నేతలు సైతం తమపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సొంత ఖర్చులతో కూల్చేయడానికి సిద్దం అంటున్నారు. హైదరాబాద్ బాగు కోసం నడుం కట్టానంటున్న సీఎం రేవంత్ చర్యలకు బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది.