బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కాగానే ఆ పార్టీలో కలవరం మొదలైంది. టిక్కెట్ దక్కని నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. సీటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కచ్చితంగా కారు దిగిపోయే అవకాశాలున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు బీఆర్ఎస్ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి ఆయన వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పారు. దీంతో శ్యామ్ నాయక్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖనాయక్కు చోటు దక్కలేదు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ఖానాపూర్ టిక్కెట్ ను భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్కు ఇచ్చారు. కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన గంటల వ్యవధిలోనే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.
సీటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరికొందరు పార్టీ మారే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీటు ఆశించిన ఆశావాహులు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టిక్కెట్ల వ్యవహారం గులాబీ బాస్ కు తలనొప్పులు తెస్తోంది.
మరోవైపు పార్టీ మారుతారనే ప్రచారాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ ఖండించారు. ఎమ్మెల్యేగా 49 రోజులు బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటాననేది త్వరలో ప్రకటిస్తానన్నారు. క్యాడర్ తన వద్ద ఉందని.. ఖానాపూర్లో మళ్లీ గెలిచేది తాననే ధీమా వ్యక్తం చేశారు. టికెట్ రాలేదన్న మనోవేధనతోనే తన భర్త కాంగ్రెస్లో చేరారని వివరణ ఇచ్చారు.