MLA Mallareddy: ఆ నేతకు ఫాలోయింగ్ ఎక్కువ. అది కూడా యూత్ లో ఆయన క్రేజ్ వేరు. అంతేకదా మూగబోయిన సభలో కూడా చిరునవ్వులు చిందింపజేసే సత్తా ఆ నేత సొంతం. అందుకే ఆ నేత ఎక్కడికి వెళ్ళినా.. సందడే సందడి. కానీ ఆ నేత ఉన్నట్టుండి సీరియస్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారన్నది పొలిటికల్ హాట్ టాపిక్. ఉన్నది ఉన్నట్లు బల్ల కొట్టినట్లు చెప్పడంలో ఈయనకు లేరు సాటి అంటుంటారు ఆయన అభిమానులు. ఇటీవల ఈయన ఉండే పార్టీ గురించి పొగిడే కన్నా.. ఇతర పార్టీలను ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకు ఆ నేత ఎవరో తెలిసి పోయిందిగా.. ఆయనే యూత్ కానీ యూత్ ఫాలోవర్స్ గల మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మేల్యే మల్లారెడ్డి.
సుధీర్ఘ రాజకీయ చరిత్ర మేడ్చల్ ఎమ్మేల్యే మల్లారెడ్డి సొంతం. తన రాజకీయ ప్రస్థానాన్ని 2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరి మల్లారెడ్డి ప్రారంభించారు. మల్లారెడ్డి అలా పార్టీలోకి వచ్చారో లేదో.. అప్పుడే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికలలో విజయాన్ని అందుకొని, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అంతేకాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు కూడా అప్పుడు ఈయనే కావడం విశేషం. ఇక ఆ తరువాత తెలంగాణ నినాదం మారుమ్రోగుతున్న వేళ.. 2016 లో టీఆర్ఎస్ పార్టీలో చేరి, తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2018లో జరగగా.. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉండే ఛాన్స్ ఈయనకు దక్కింది.
ఆ సమయంలో ఈయన రూటే సపరేట్. ఈయన ఏ కామెంట్ చేసినా.. అది వైరల్. డ్యాన్స్ చేసినా కూడా అంతే. బీఆర్ఎస్ పై విమర్శలు వచ్చాయో.. ఈయన అక్కడ వాలిపోతారు. అటువంటి స్థితిలో 2024 లో ఎన్నికలు జరిగాయి… కాంగ్రెస్ అధికారం చేజిక్కుంచుకుంది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మల్లారెడ్డి విజయాన్ని అందుకున్నారు. కొద్దిరోజులకు మల్లారెడ్డి టీటీడీపీ భాద్యతలు తీసుకోబోతున్నారంటూ టాక్ బాగా నడిచింది. కానీ వాటిని మల్లారెడ్డి ఖండించలేదు.. సైలెంట్ గా ఉన్నారు.
అంతవరకు ఓకే ఇటీవల తన మనువరాలి వివాహం చేయబోతున్నారు. అందుకే ఆల్ పార్టీ నాయకులను ఆయన కలుస్తున్నారు. ఇది రాజకీయాలలో కామన్. విమర్శలు చేసుకున్నా.. శుభకార్యాలకు పిలుపునివ్వడం. ఇక్కడే ఈయన మాజీ ఎమ్మేల్యే, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిని వెంట తీసుకెళ్లి.. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తీగల బయటకు రాగానే మల్లారెడ్డి సమక్షంలో తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అక్కడ సైలెంట్ గా ఉన్న మల్లారెడ్డి.. మరికొద్ది రోజులకు మీడియాతో మాట్లాడుతూ.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ. అందుకే చంద్రబాబును కూడా కలిశా.. పెళ్లికి ఆహ్వానించానన్నారు.
Also Read: KTR: కేటీఆర్కు నిరసన సెగ… ఇన్నాళ్లు ఏం చేశారంటూ నిలదీత
అయితే తీగల కృష్ణారెడ్డిని పక్కా వ్యూహంతోనే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారని, వివాహం అనంతరం టీటీడీపీ పగ్గాలు మల్లారెడ్డి చేపట్టనున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని, నెక్స్ట్ రాజకీయ వ్యూహం ప్రకారం టీడీపీలోకి మల్లారెడ్డి వెళ్లడం ఖాయమంటూ చర్చలు జోరందుకున్నాయి. ఏదిఏమైనా మల్లారెడ్డి పార్టీ మారి టీడీపీ పగ్గాలు చేపడితే.. టీటీడీపీకి పూర్వ వైభవం రానుందనేది టీడీపీ అభిమానుల వాదన.
ఇవన్నీపుకార్లయినప్పటికీ మల్లారెడ్డి మనసులో ఏముందో మనకెలా తెలుస్తుంది.. ఆయన పార్టీ మారరు.. బీఆర్ఎస్ లోనే ఉంటారన్నది మరో వర్గం వాదన. మొత్తం మీద మల్లారెడ్డి పార్టీ మార్పు తెలంగాణలో జోరందుకోగా.. అవన్నీ పుకార్లే అంటున్నారు మల్లారెడ్డి వర్గం. ఏదేమైనా మల్లారెడ్డి ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే మరి.