Malla Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. మల్లారెడ్డి ఏ ఈవెంట్లో పాల్గొన్నా.. పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డ.. ఫేమస్ అయినా అంటూ చెప్పుకొస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.
ఇక తాజాగా గోవా బీచ్లో ఎంజాయ్ చేశారు మల్లారెడ్డి. గోవా బీచ్లో బోటింగ్, పారాసైలింగ్ చేసి సందడి చేశారు. అయితే ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే మల్లారెడ్డి సడన్ గా గోవా టూర్ వెనక రాజకీయ వ్యూహం ఉందని వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ తో మల్లారెడ్డికి భయం పట్టుకుందని అంటున్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో భూ కబ్జాల ఆరోపణలు.. స్థానిక ఎన్నికల్లో టికెట్స్ అమ్ముకున్నారని డైరెక్ట్ ఆడియోలు బయటికి రావడంతో.. ఎన్నికల్లో పరాజయం తప్పదనుకున్నారు. కానీ తక్కువ మెజారిటీతో ఊహించని రీతిలో గట్టెక్కారు.
ప్రస్తుతం మల్లారెడ్డికి అంతకు మించిన పెద్ద టాస్క్ ముందుందని తెలుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గంలో 3 కార్పొరేషన్స్.. 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఓ వైపు మున్సిపల్ కార్పొరేషన్స్ లో అవిశ్వాస తీర్మానాల పర్వం నడుస్తోంది. దాంతో నేతలను కాపాడుకోవాలని కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్ల పార్టీ మార్పులు మీద మల్లారెడ్డి ఫోకస్ పెట్టారని భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు పీర్జాదిగూడ కార్పొరేషన్ లో ఉన్న 26 కార్పొరేటర్లు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు గమనించిన మల్లారెడ్డి.. వారందరినీ గోవా ట్రిప్ కి తీసుకెళ్లారని అనుకుంటున్నారు. అక్కడ నేతలతో బుజ్జగింపుల పర్వం నడిపిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. దీంతో మల్లారెడ్డి గోవా ట్రిప్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
.
.