BRS MLA Danam Nagender Meets CM Revanth Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శలు రోహిత్ చౌదరీ, విష్ణునాథ్ , మన్సూర్ అలీఖాన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
కొన్నిరోజులుగా దానం కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనా ఆయన స్పందించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ప్రభుత్వ స్కీములకు తన మద్దతు ఉంటుందని దానం వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ సమయంలో మంత్రిగానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున దానం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ విజయభేరి మోగించారు.
Also Read : బీఆర్ఎస్తో పొత్తు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు..!
దానం నాగేందర్ తొలిసారిగా 1994లో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ నుంచి రెండోసారి గెలిచారు. 2004లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి విజయం సాధించారు. అయితే వెంటనే కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చేశారు. అంతేకాదు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే అనూహ్యంగా ఉపఎన్నికలో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ బరిలోకి దిగుతున్నారు.
దానం నాగేందర్ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో దాదాపు 25 ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం సాగుతోంది.