BRS : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. బండి సంజయ్ పై గవర్నర్ తమిళిసైకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ మేయర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మహిళా నేతలంతా రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్న గవర్నర్.. తమకు ఎందుకు ఇవ్వరని మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ స్పందించాలని కోరారు. బండి సంజయ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
రాజ్ భవన్ కు మహిళా నేతలు భారీగా చేరుకోవడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఒక దశలో మహిళలు రాజ్భవన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గవర్నర్ అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ మహిళా నేతలు వినతిపత్రాలను బారికేడ్లకు అంటించి నిరసన తెలిపారు.
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana