BRS Leaders Pig Scam In Jadcherla : జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల పంచాయితీ హాట్ టాఫిక్గా మారింది. మున్సిపాలిటీ పరిధిలో పందుల నిర్మూలన సాకుతో పాలకవర్గంలోని కొంతమంది వాటిని అమ్ముకున్నారన్న ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ఈ అంశంపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సైతం సీరియస్ అవ్వడంతో ఈ పందుల పంచాయితీ చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ వ్యవహారంలో దాదాపుగా కోటిన్నర మేర స్కాం జరిగినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి
జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల వివాదం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. పందుల నిర్మూలన సాకుతో సుమారు కోటిన్నర విలువ చేసే పందులను అమ్ముకున్నారని బాధితులు వాపోతున్నారు.ఈ వ్యవహారంలో మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త, కొంతమంది కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2 నెలల క్రితం పట్టణంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని మున్సిపాలిటీకి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. స్పందించిన మున్సిపల్ పాలకవర్గం వాటిని నిర్మూలించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వేల సంఖ్యలో పందులను పట్టించారు. అయితే ఇదే సాకుతో మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త రవీందర్, కొంత మంది కౌన్సిలర్లు, అధికారులు.. పట్టించిన 88 టన్నుల పందులను అమ్ముకుని కోటి 30 లక్షల రూపాయల డబ్బులు స్వాహా చేశారంటున్నారు.
పందుల పంచాయితీ ఎమ్మెల్యే వరకూ వెళ్లింది. అసలు ఈ పందుల అమ్మకం ఏంటో తేల్చాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. దీనివెనుక ఎవరున్నారనేది తనకు తెలుసని.. త్వరలో బయటపెడతానన్నారు.
పందుల తరలింపు విషయం తనకు తెలియదన్నారు.. మున్సిపల్ కమిషనర్. ఇదంతా ప్రైవేటు వ్యవహారమని, దానికి తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే , పోలీసుల ఆదేశాల ప్రకారం దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై పందుల వ్యాపారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త రవీందర్ పందులను అక్రమంగా తరలించి, అమ్ముకున్నారని పందుల వ్యాపారి బాలస్వామి జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీవానాధారం సర్వం కోల్పోయామని వాపోతున్నారు. తరలించొద్దని మొరపెట్టుకున్నా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పందులను అడిగితే…9 లక్షలు డిమాండ్ చేశారన్నారు. మొత్తంగా స్కాంలకు కాదేదీ అనర్హం అంటూ తెరమీదకు వచ్చిన ఈ పందుల అమ్మకం స్కాం… జడ్చర్లలో హాట్ టాపిక్ గా మారింది.
పందుల నివారణ పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేసిన వారిని వదిలేది లేదంటూ..జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున మార్పులు రాబోతున్నాయని.. అవినీతిపరుల భరతం పడతామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే వదిలేది లేదని అనిరుధ్ స్పష్టం చేశారు.
.
.