BRS leaders ktr and Harish rao went to Delhi to meet Kavitha: లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను ఆదివారం కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. కవిత కస్టడీని ఈ నెల 31 దాకా పొడిగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కవితతో ములాఖత్ అయిన అనంతరం కేటీఆర్, హరీష్ రావులు మరో రెండు లేక అంతకన్నా ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉండేలా షెడ్యూల్స్ ఖరారు చేసుకున్నరు. గతంలోనూ వీరిద్దరూ కవితను కలిశాక ఢిల్లీలోనే నాలుగు రోజులు ఉన్నారు. ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారని..బీజేపీతో పార్టీని విలీనం చేయబోతున్నారని అందుకే ఢిల్లీకి చేరారని కొన్ని మీడియాలలో వార్తా కథనాలను వండి వార్చారు. మరి కొన్ని మీడియా సంస్థలు ఢిల్లీకి వెళ్లింది సుప్రీం న్యాయ నిపుణులను సంప్రదించి కాంగ్రెస్ లోకి వలసవెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించడానికే అంటూ కథనాలు వచ్చాయి. అనేక అనుమానాల నేపథ్యంలో హరీష్, కేటీఆర్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
సభ్యత్వాలు రద్దయితే?
ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల రేవంత్ రెడ్డి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడనుందని వారి సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉందని బాంబు పేల్చారు. శాసనసభలో నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ వీరి సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉంది. దీనిని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి? స్పీకర్ తమ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కాకుండా ముందుగానే ఎదుర్కునేందుకు ఏవైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చో న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకు ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారని వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ మెడకు ఎక్సయిజ్ కత్తి
ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఎక్సయిజ్ శాఖకు పన్నుల చెల్లింపుల విషయంలో రూ.77 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని కాగ్ తన ప్రాథమిక విచాణలో తేల్చింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి గా తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వెయ్యి కోట్లకు పైగా స్కామ్ చేశారని ఆయనపై పోలీసులు కేసును నమోదు చేశారు. కేసీఆర్ కు మొదటి నుంచీ సోమేష్ కుమార్ నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. తీరా ఈ వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ అంశాలను కూడా న్యాయనిపుణులతో చర్చించే అవకాశం ఉంది. అవసరమైతే మోదీ సాయం తీసుకోవాలని, రేవంత్ కు కంట్రోల్ చేయాలంటే ప్రస్తుతం బీజేపీ తస్ప తమకు మార్గం కనిపించడం లేదని బీఆర్ెస్ కింది స్థాయి నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇద్దరూ కలిసి ఢిల్లీకి కవితను కలిసేందుకు వెళ్లినా..దాని వెనుక చాలా అంశాలే ఉన్నాయని అనుకుంటున్నారంతా..