BRS leaders joining in Congress..not interest to go in BJP
తెలంగాణలో వలసల సీజన్ ఊపందుకుంది. బీఆర్ఎస్ నేతలంతా క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఇప్పటికే సగానికి పడిపోయిన ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నేతలు గందరగోళంలో ఉన్నారు. రేవంత్ వ్యూహాలు ఫలించాయి. ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే జనాలకు ఒక్కటే విషయం అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ నుంచి ఇంతమంది కాంగ్రెస్ లో చేరిపోతుంటే..బీజేపీ వైపు ఒక్కరు కూడా కన్నెత్తి ఎందుకు చూడటం లేదు? కారణం ఏమిటి?
8 మంది ఎంపీలు
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, పైగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ధీటుగా 8 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో భారీగా ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. మరి అలాంటప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నేతలను ఎందుకు ఆకర్షించలేకపోతోంది. లోపం ఎక్కడ? అని బీజేపీ శ్రేణులు తలలు బాదుకుంటున్నారు. గతంలో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దాదాపు చేరినట్లే అనుకున్నారంతా. అయితే ఆఖరు నిమిషంలో ఏం జరిగిందో తెలియదుగానీ మల్లారెడ్డి, ఆయన అల్లుడు సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలోనూ అసమ్మతి వాదులు లేకపోలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు. అయినా వీళ్లకు వేరే ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉండిపోయారు. కనీసం క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడా బీజేపీలో మారేందుకు ఇష్టపడటం లేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల, డీకే అరుణ లాంటి ఉద్ధండులైన నేతలు ఉన్నా బీజేపీలోకి ఏ ఒక్కరూ ఆకర్షితులవడం లేదు.
షరతులేనా కారణం?
అయితే కాంగ్రెస్ పార్టీలో విధానాలు వేరు. బీజేపీ విధానాలు వేరుగా ఉన్నాయి. బీజేపీలో చేరాలనుకునేవారికి ఆ పార్టీ అధినేతలు పెడుతున్న షరతులే వారి పార్టీకి విఘాతంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీకి రావాలంటే వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరాలనే షరతు విధించడంతో ఏ ఒక్కరూ బీజేపీలో చేరేందుకు ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి షరతులు ఏవీ లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలంతా క్యూ కడుతున్నారు.
తెలంగాణకు సారథి ఏరి?
గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలోకి చేరారు. ఈటల రాజేందర్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు లో జరిగిన ఉప ఎన్నికలలో ఓడిపోయారు. బీజేపీలో పార్టీ సారథ్యాన్ని ఇంకా ఎవరికీ అప్పజెప్పలేదు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొన్నటిదాకా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా పదవిని చేపట్టాక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ లేక నిర్ణయాలు సైతం తీసుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. వీటన్నింటి దృష్ట్యా బీజేపీలోకి చేరడానికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు.
ఇలాగైతే చాలా కష్టం
ఇకనైనా పార్టీ చేరికలపై బీజేపీ దృష్టిపెట్టాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. ఉండటానికి 8 మంది ఎంపీలు..కానీ ఏ ఒక్కరికీ ఒకరంటే ఒకరు పడటం లేదని టాక్ నడుస్తోంది. ఎన్నికల ముందు హడావిడి చేసిన ఆ పార్టీ అగ్రనేతలు కూడా తెలంగాణపై కన్నెత్తి చూడటం లేదు. ఇలాగైతే తెలంగాణలో బీజేపీ బలపడేది ఎలా అని సొంత పార్టీ నేతలనే కార్యకర్తలు నిలదీస్తున్నారు.