Congress : తెలంగాణ కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పలువురు నేతల చేరికతో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ ఆ జోరును కంటిన్యూ చేస్తోంది. తాజాగా మరికొందరు కీలక నేతలు హస్తం కండువా కప్పుకున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. TPCC చీఫ్ రేవంత్రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత రేవంత్ సమక్షంలోనే సుధీర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు . ఆయనకు కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు రేవంత్.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి.
45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ను అవినీతిమయం చేశారని ఆరోపించారు. మేడ్చల్ నుంచి మంత్రిని తరమికొడతామని హెచ్చరించారు.
సుధీర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు మేడ్చల్ జడ్పీ ఛైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మేడ్చల్ కౌన్సిలర్లు , 10 మంది సర్పంచ్లు కూడా హస్తం గూటికి చేరారు. రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రేవంత్రెడ్డి సమక్షంలో కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.