Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. చాలామంది నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 30 మంది సర్పంచ్లు, 12 మంది ఎంపీటీసీలు హస్తం గూటికి చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని విమర్శించారు. గద్వాల జిల్లా కాంగ్రెస్ కంచుకోటని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్రెడ్డి ఛాలెంజ్ చేశారు.