Chandrababu: ఖమ్మంలో టీడీపీ శంఖారావం. భారీ బహిరంగ సభతో చంద్రబాబు బల ప్రదర్శన. జనం బాగా తరలివచ్చారు. టీడీపీ అధినేతకు ఘన స్వాగతం పలికారు. సభ గ్రాండ్ సక్సెస్ అనిపించారు. కట్ చేస్తే.. చంద్రబాబు సభపై బీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితను చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసమే.. కావాలనే ఖమ్మం బోర్డర్ లో చంద్రబాబు మీటింగ్ పెట్టారని హరీష్ రావు అన్నారు. ఆ సభకు ఏపీ నుంచే జనాలను తరలించారని చెప్పారు. గతంలో చంద్రబాబు దెబ్బకు మహాకూటమి ఖతమైందని.. ఆయనది భస్మాసుర హస్తమన్నారు హరీష్ రావు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు.
ఏపీని అప్పుల పాలు చేసి చంద్రబాబు ఇక్కడికి వచ్చారని.. బాబును చిత్తుచిత్తుగా ఓడించారని హరీష్ రావు సెటైర్లు వేశారు. చంద్రబాబు పాలనలోనే తెలంగాణ దోపిడీకి గురి అయిందని.. ఉద్యోగాలు అడిగితే యువకులను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని ఆరోపించారు. హైదరాబాద్ ను ఫ్రీజోన్ చేసి ఇక్కడి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని.. ఉచిత కరెంట్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అన్నారని గతాన్ని గుర్తు చేశారు హరీష్ రావు.
చంద్రబాబు అన్నీ నావల్లే అంటారని.. తెల్లారితే, కోడి కూస్తే కూడా నావల్లే అని ప్రచారం చేసుకుంటారని హరీష్ ఎద్దేవా చేశారు. నల్గొండలో ఫ్లోరోసిస్ ను పారద్రోలింది చంద్రబాబు కాదని.. కేసీఆర్ హయాంలోనే ఫ్లోరైడ్ బూతాన్ని తరిమికొట్టామని హరీష్ చెప్పారు.
మరోవైపు.. ఖమ్మం టీడీపీ సభపై ఎమ్మెల్సీ కవిత సైతం సెటైర్లు వేశారు. “చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కటే..
తెలంగాణలో పార్టీలు ఎన్నున్నా కేసీఆర్ ఒక్కరే” అని కవిత అన్నారు. గతంలో టీడీపీని ప్రజలు తిరస్కరించారని..
ఈసారి కూడా ఆ పార్టీకి ఆదరణ ఉండదని తేల్చి చెప్పారు.
ఇక, మంత్రి పువ్వాడ సైతం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తామంతా కమ్మగా ఉన్నామని.. మళ్లీ ఆగం చేయకండిని చంద్రబాబుపై మండిపడ్డారు.