MLA Rajaiah news today(Latest political news telangana) : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల మధ్య పంచాయితీ ప్రగతి భవన్ కు చేరింది. మాజీ మంత్రులు రాజయ్య, కడియం శ్రీహరి మధ్య జరుగుతున్న వివాదంపై హైకమాండ్ ఫోకస్ చేసింది. రాజయ్యను వెంటనే ప్రగతిభవన్ కు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రి కేటీఆర్ తో వెంటనే భేటీ కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
ఇటీవల కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన తల్లి కులం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. తననపై చేసిన ఆరోపణలను ఖండించారు. తన తల్లి కులం గురించి ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు.
ఇలా ఇద్దరు సీనియర్ నేతల మధ్య వివాదం ముదరడంతో బీఆర్ఎస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. అందుకే ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతి భవన్ కు పిలిచింది. కడియం శ్రీహరిపై చేసిన విమర్శలపై వివరణ అడిగే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరి నేతల మధ్య వైరంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో 4 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అదే స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న నేతల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది.