BRS Govt Corruption | ఓల్డ్ సిటీయే అసలు హైదరాబాద్. అలాంటి పాతబస్తీకి ఇప్పటికీ మెట్రో సేవల్లేవ్. కారణం ఎవరు? గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అన్నది విశ్లేషకుల మాట. తన అనుకున్న వాళ్లకు లబ్ది చేకూరేలా గత ప్రభుత్వం నడుచుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి.
BRS Govt Corruption | ఓల్డ్ సిటీయే అసలు హైదరాబాద్. అలాంటి పాతబస్తీకి ఇప్పటికీ మెట్రో సేవల్లేవ్. కారణం ఎవరు? గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అన్నది విశ్లేషకుల మాట. తన అనుకున్న వాళ్లకు లబ్ది చేకూరేలా గత ప్రభుత్వం నడుచుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికల తర్వాత.. ప్రభుత్వం మారటం కామన్. ఆ తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయడం.. వాటి ప్లేస్ లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం సాధారణం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి తనదైన మార్కు పాలనతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ .. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడం. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అయితే భవిష్యత్ తరాల బాగుకోసం ఆలోచించే రేవంత్ రెడ్డి ఔటర్ మెట్రో రద్దు చేసినట్టు తెలుస్తోంది. కానీ… మెట్రో రద్దు స్టోరీ ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలంటే.. ట్రిపుల్ వన్ జీవో గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. చాలా ఏండ్ల వరకు ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి. కాగా ఈ జలాశయాలను కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కారు జీవో 111 తీసుకొచ్చింది. ఈ జీవో కారణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం ఏర్పడిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ సర్కారు దిగిపోయే ముందు ఆ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్న పదేళ్లలో ఆ జీవో గురించి పట్టించుకోని ప్రభుత్వం దిగిపోయే ముందు రద్దు చేయడం వెనక వేరే మతలబు ఉందన్నది జగమెరిగిన సత్యం.
కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాయదుర్గం-ఎయిర్ పోర్టు మెట్రోను ప్రతిపాదించింది. అయితే అప్పటి నుంచే వ్యూహాత్మకంగా తమ అనుకూల రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేయాలన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన అని తేలిపోయింది. అందుకు అనుకూలంగానే ఎప్పుడూ కూడా అప్పా జంక్షన్, నార్సింగి, మెయినాబాద్ వైపే అభివృద్ధి చేసుకుంటూ వెళ్లారు. తొలుత ఎయిర్ పోర్టు వరకు మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణం చేయాలన్న నిర్ణయం, ఆ తర్వాత ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత..ఇలా గత ప్రభుత్వం కొందరికీ లాభం చేయాలన్న ఉద్దేశంతోనే నడుచుకుందని క్లియర్గా అర్థమవుతోంది.
ఎందుకంటే ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని లక్ష ఎకరాల ప్రైవేటు భూముల్లో దాదాపు 70శాతం బడా బాబులవే. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వ్యాపారులు, రియాల్టర్లదే అక్కడి భూముల్లో సింహభాగమని ఆరోపణలు ఉన్నాయి. ఆ జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో మొత్తంగా సుమారు 1.32 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. అందులో గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు తీసేస్తే లక్ష ఎకరాలు ఉంటుంది. ఇందులో 70 వేల ఎకరాలు పెద్దోళ్ల చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిన 30శాతం భూమి మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. ఇలా ఓ ప్లాన్డ్ గా తీసుకున్న నిర్ణయాలతో అక్కడి భూముల్లో వందలాదిగా వెంచర్లు ప్రారంభించడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ అభివృద్ధి ఆ ఏరియాకే పరిమితం అవుతుంది. దీన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బడాబాబులకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపీ నుంచి మంత్రుల వరకు జీవో 111 పరిధిలోని భూములను కొనుగోలు చేశారు. జీవో రద్దు అవుతుందని తెలిసే ముందుగా వేల ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు మరికొందరు ప్రజాప్రతినిధులు ఏకంగా వందల ఎకరాల్లో ఫాంహౌజ్లను నిర్మించుకున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు అయితే పదుల ఎకరాల నుంచి వందల ఎకరాలు కొన్నారు. అంటే వీరికి 111 జీవోను ఎత్తేస్తారని సమాచారం ముందుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రముఖులంతా జీవో 111 పరిధిలోనే వేల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్కు సమీపంలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, గండిపేట, శంషాబాద్, షాద్నగర్, షాబాద్ మండలాల్లో రాజకీయ నేతలతో పాటు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కొన్నారు.
ఔటర్ మెట్రోతో రియల్ ఎస్టేట్ సంస్థలకే లాభం. అవును ఇది వాస్తవం. ఎవరు కాదన్నా.. ఇదే నిజం. గత ప్రభుత్వం ఓఆర్ఆర్ ఉన్న ఏరియాలోనే మెట్రోను ప్రతిపాదించడం వెనక ఇతర కారణాలు ఉన్నాయని అర్థమైపోయింది. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ మంచి జోరు మీదుంది. ప్రత్యేకించి భారీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చేపట్టడంతో.. ఐటీ కారిడార్ నుంచి ఎయిర్ పోర్టు రూట్లో రియల్ ఎస్టేట్కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే లగ్జరీ విల్లాలు, వేల మంది ఉండే అపార్టుమెంట్లకు దీటుగా హైరైజ్ బిల్డింగ్లు ఆయా ప్రాంతాల్లో భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రాయదుర్గంతో ఆగిపోయిన మెట్రో లైన్ను విస్తరణ పూర్తయితే.. రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని గత ప్రభుత్వం చెప్పింది. కానీ అసలు విషయం తమవాళ్లకు లబ్ది చేకూర్చడమే అన్నది లోలోపలా వినిపిస్తున్న మాట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. జనాల మధ్యలో నుంచే మెట్రో పరుగులు తీయాలని సంకల్పించారు. అలా అయితే కనెక్టివిటీ మరింత పెరుగుతుందని తద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది సీఎం ఆలోచన.
ఓరకంగా చెప్పుకోవాలంటే పాతబస్తీయే అసలు హైదరాబాద్. చార్మినార్, మక్కామసీదు, హైకోర్టు లాంటి అనేక పురాతన కట్టడాలు అక్కడే ఉన్నాయి. విదేశాల నుంచి పర్యాటకులు కూడా ఎక్కువగా పాతబస్తీనే సందర్శిస్తారు. అందుకే సీఎం రేవంత్రెడ్డి ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ సీఎం సమావేశమయ్యారు. ఓల్డ్ సిటీని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వారితో చెప్పారు. ఓల్డ్ సిటీకి ప్రధాన రవాణా సౌకర్యం ఆర్టీసీనే. ఇప్పటికీ అక్కడి జనాలు ఆటోలు లేదా సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఫలక్ నుమా వరకు ఎంఎంటీఎస్ సేవలు ఉన్నా.. దాని కనెక్టివిటీ ఎక్కువగా లేదు. అందుకే అక్కడి ప్రజలు ప్రైవేట్ వాహనాల మీద ఆధారపడాల్సి వస్తోంది. అలాంటి ప్రాంతంలో మెట్రో రైలు అందుబాటులో ఉంటే ఎంతో ఉపయోగకరం. ఇలా మెట్రో ఎయిర్ పోర్టు రూట్ ను రద్దు చేయడం వెనక రేవంత్ రెడ్డి దూరదృష్టి ఎంతగానో ఉందంటున్నారు మేధావులు. అందుకే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేస్తూనే.. ప్రజాపాలన అందిస్తామన్న మాటను నిజం చేసి చూపిస్తున్నారు.