BRS Candidates Frustration : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు అదుపు తప్పుతున్నారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నా, ప్రశ్నించినా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటీవల మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .. ప్రశ్నించినవారిపై చిందులు తొక్కారు. తిట్ల పురాణం అందుకున్నారు. తాజాగా మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ ఇలానే ప్రవర్తించారు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రచారంలో ఓ మహిళ పట్ల శంకర్ నాయక్ వ్యవహరించిన తీరుపై పార్టీ శ్రేణులే అసహనం వ్యకం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ నియోకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన.. ఎన్నికల ప్రచారంలో నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం వెళ్లారు. అక్కడ ప్రచారం నిర్వహిస్తుండగా ఓ మహిళ తన గోడును చెప్పే ప్రయత్నం చేశారు. కానీ శంకర్ నాయక్ పట్టించుకోలేదు. మళ్లీ అమ్ముడుపోయి సారా తాగుపోండంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో శంకర్నాయక్ తీరుపై పార్టీ కార్యకర్తలే విస్తుపోయారు.
మరోవైపు చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్ధి సుంకే రవిశంకర్కు ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లగా మిడ్ మానేరు ముంపు బాధితుడు చెప్పు చూపించాడు. మిడ్ మానేరు ముంపు గ్రామాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. నీలోజిపల్లి గ్రామంలో సుంకె రవిశంకర్ మాట్లాడుతుండగా గ్రామస్థుడు అడ్డుకొని చెప్పు చూపించాడు. రవిశంకర్ కి చెప్పు చూపుతూ నిరసన తెలిపిన యువకుడికి బీఆర్ఎస్ శ్రేణులు నచ్చ చెప్పి అక్కడ నుంచి పంపించేశారు.
సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే.. బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తనకు కాంగ్రెస్ నేతల నుంచి ముప్పు పొంచి ఉందని రవిశంకర్ అంటున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న చొప్పదండిని గుండాల చేతుల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.