CM Revanth Reddy : సీఎం రేవంత్రెడ్డితో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రిని కలిశారు. ఫ్యామిలీతో కలిసి వెంకట్రావు సీఎం వద్దకు వెళ్లారు. వారి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఓ వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి తెల్లం వెంకట్రావు అందించారు.
ఇంతకుముందు కూడా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెల్లం వెంకట్రావు కలిశారు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 3 నెలల వ్యవధిలోనే రెండోసారి సీఎంతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. తొలుత ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ముఖ్యమంత్రిని కలవడంపై తీవ్ర చర్చ జరిగింది. వారంతా పార్టీ మారతారని ప్రచారం జరిగింది.
Read More: కాంగ్రెస్ కంచుకోట.. మల్కాజ్ గిరిలో ఈటల నెగ్గేనా ? బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటి ?
ఆ తర్వాత నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై వివరణ ఇచ్చుకున్నారు. తాము పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు సీఎంను కలిశామని చెప్పుకొచ్చారు.
ఇటీవల మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొన్నిరోజుల క్రితం రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సమయంలో కూడా ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. రెండోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది.