Sangareddy : ప్రేమ పెళ్లి.. కొందరికి వరమైతే మరికొందరికి అదే శాపం. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి జీవితం దినదిన గండంగా మారుతోంది. నెలరోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతులపై కత్తులతో దాడి చేసి యువతిని బలవంతంగా ఎత్తుకుపోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నస్తీపూర్ గ్రామానికి చెందిన నీరుడి అనిల్.. రామచంద్రాపూరం మండలం స్టేషన్ నాగులపల్లికి చెందిన అశ్విని దగ్గరి బంధువులవుతారు. వీరిద్దరూ నెలరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అప్పటి నుంచి నస్తీపూర్ లోని అనిల్ ఇంటివద్ద నూతన దంపతులు ఉంటున్నారు.
నవంబర్ 5వ తేదీన కుటుంబ పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి జరిపించేందుకు యువకుడి కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లిపత్రికలు కూడా ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు, బంధువులు సోమవారం తెల్లవారుజామున నస్తీపుర్ లోని అనిల్ ఇంటిపై, అనిల్ పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువతిని తమతో తీసుకెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని తీవ్రగాయాలపైన అనిల్ ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.