Charminar: బ్రేకింగ్ న్యూస్. చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టు అగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో పేలిపోతుందని హెచ్చరించాడు. అలర్ట్ అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నాయి. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ఇంచు ఇంచు పరిశీలించారు.
చార్మినార్ ప్రాంతంలో ఫుట్ పాత్ లపై ఉన్న షాపులను పోలీసులు తొలగించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. గంటకు పైగా తనిఖీలు చేసినా.. ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో.. ఇది ఆకతాయిల ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చారు.
మంగళూరులో ఆటోలో కుక్కర్ బ్లాస్ట్ కలకలం రేపిన సందర్భంలో.. చార్మినార్ దగ్గర బాంబు పెట్టారనే వార్త తీవ్ర కలకలం రేపింది. నిజంగానే బాంబు ఉందేమోననే భయంతో ఆ ప్రాంతవాసులు వణికిపోయారు. కట్ చేస్తే….
చార్మినార్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన మాట పూర్తిగా అబద్దమని ఆ తర్వాత పోలీసులు స్పష్టం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే చార్మినార్ ప్రాంతంలో సోదాలు చేశామని.. ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అబద్దమని తేల్చి చెప్పారు.