Boduppal Incident: హైదరాబాద్ బోడుప్పల్లోని నిమిషాంబికా ఆలయంలో అపచారం జరిగింది. స్థానికంగా ఉన్న నిమిషాంబికా దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారికి ఫ్రాక్ అలంకరించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పూజారి మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకోవడం గమనార్హం.
ప్రతి ఏటా బోడుప్పల్లోని నిమిషాంబికా దేవాలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడు ఆలయ పూజారి అమ్మవారిని చీరకు బదులుగా ఫ్రాక్తో అలంకరించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవీ శరన్నవరాత్రల్లో భాగంగా 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. ఎక్కడైనా అమ్మవారిని చీరలోనే అలంకరిస్తారు. భక్త కోటి అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన చీరలను కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవీ నవరాత్రుల సమయంలో ఒక్కో రోజు అమ్మవారికి ఒక్కో రంగు చీరలను అలంకరిస్తారు. కానీ ఇదిలా ఉంటే ఎక్కడా లేని విధంగా బోడుప్పల్లోని ఆలయలంలో అమ్మవారిని ఫ్రాక్ తో అలంకరించాడు ఓ పూజారి.
ఈ విధంగా అమ్మవారికి ఫ్రాక్ వేయడమే కాకుండా అందుకు తగిన జ్యువెలరీని కూడా అలంకరించాడు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. పూజారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసున్నారు భక్తులు. ఈ విషయంపై భక్తులు పూజారిని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో వారిని దూషించాడు. శాస్త్రం గురించి మీరు నాకు చెప్తారా అంటూ ఎదురు సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా పూజారి తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కూడా జరిగింది.