Black Magic: నిజామాబాద్ నగర శివారులో క్షుద్రపూజల కలకలం రేపాయి. నగర శివారులోని మాణిక్ భండార్ సమీపంలోని శ్మశాన వాటికలో కొందరు చేతబడి చేస్తున్నారనే సంచారంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. మేకను బలి ఇచ్చినట్లు గుర్తించి అక్కడే చేతబడి చేస్తున్నవారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కలుగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
పోలీసుల మాట కూడా వినకుండా..వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు సైతం స్థానికులపై లాఠీఛార్జి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. కాగా.. శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేయడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి హాని చేయాలని ఈ క్షుద్రపూజలు చేశారోనని భయపడుతున్నారు.