BJP party news in telugu(Latest political news in India): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన కమలం పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అటు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాజకీయాలు, ఎన్నికలు, పార్టీ బలోపేతంపై చర్చ సాగింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. దక్షిణాదిన పార్టీ బలోపేతంపై కూలంకష చర్చ జరిగింది. దక్షిణాది ఎజెండాను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నడ్డా ఆదేశించారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేసిన నడ్డా.. పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరు పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించింది. తెలంగాణ ఇన్ఛార్జ్గా ప్రకాష్ జవదేకర్కు బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం సహ ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్ ను నియమించింది. రాజస్థాన్ ఇన్ఛార్జ్గా ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్గా ఓం ప్రకాష్ మాథుర్, మాండవియాలను ప్రకటించింది. బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు.. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. మరో 4 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నందున ఇక్కడ బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా ఈ సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.