Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ అయ్యిందా? మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాల్సిందేనా? స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేయనున్నారా? వీటిలో సక్సెస్ అయ్యినవారికే పదవులా? ప్రస్తుతం అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బాహుబలి మూవీలో కాలకేయుడ్ని అంతం చేసిన వారికే.. మహిష్మతి సింహాసనం అప్పగించాలన్నది యువరాజులకు టార్గెట్ ఫిక్స్ చేశారు శివగామి. ఇదే పరిస్థితి తెలంగాణ బీజేపీ నేతల వంతైంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో అధ్యక్ష, మిగతా విభాగాల పదవుల కోసం నేతల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. తెలంగాణ అధ్యక్ష రేసులో ఉండే నేతలకు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసింది హైకమాండ్. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని, దీని లక్ష్యంగా ఇప్పటి నుంచే అడుగులు వేయాలని నేతలకు సంకేతాలు వెళ్లాయి.
గురువారం బీజేపీ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యనేతలు, వివిధ మోర్చాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతలు హాజరయ్యారు.
ALSO READ: బీజేపీ నేతలకు.. బన్సల్ ట్రీట్మ్మెంట్
ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. సభ్యత్వం నమోదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేయాలని భావించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై కమిటీ నేతలతో చర్చించారు.
రెండు లేదా మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు సునీల్ బన్సల్. ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఇదే సమయంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది. అనుసరించాల్సిన వ్యూహం సంబంధిత కమిటీలతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్. ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంటక రమణరెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఆరూరి రమేష్, వినోద్ రావు, బంగారు శృతి ఈ కమిటీలో కీలక నేతలు.
ఈ రెండు ఎన్నికల్లో పార్టీని సక్సెస్గా నడిపిన నేతలకు పదవులు ఇవ్వడం ఖాయమనే చర్చ కమలనాథుల్లో జరుగుతోంది. పార్టీని బలోపేతం చేయడమేకాదు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరనేది కూడా తేలిపోనుంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ బిగ్ టాస్క్ ఇచ్చినట్టేనని అంటున్నారు.