తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గడువు కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీలో మాత్రం ఎన్నికల జోష్ కనిపించడంలేదు. అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తే ప్రారంభించలేదు.
బీజేపీ నాయకత్వం ధోరణితో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మరి కమలనాథుల జాప్యం వెనుక ఉన్న మర్మమేంటి? బీఆర్ఎస్, కాంగ్రెస్లతో సమానంగా స్పీడ్ పెంచకపోవడం వెనుక వ్యూహమేంటనేది హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ జరిగింది. బీఆర్ఎస్ ను గద్దే దింపేస్తామని ఆ సభలో కేంద్ర హోంమంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీదే అధికారమంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయినా సరే క్యాడర్ లో జోష్ పెరగలేదనే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల రణరంగంలో వేగంగా దూసుకుపోవాలని అమిత్ షా నిర్దేశించినా రాష్ట్ర నాయకులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు వస్తుందని తొలుత ప్రచారం సాగింది. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ ప్రక్రియ ఇప్పట్లో పూర్తికాదనిపిస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు చేయడానికే రాష్ట్ర కాషాయ నేతలు పరిమితం అవుతున్నారే తప్ప పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంలేదనే చర్చ నడుస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఆచితూచి వ్యవహరించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో గుబులు రేపింది. చాలా మంది నేతలు గులాబీ పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టిక్కెట్ దక్కని నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అందులో చాలామంది కాంగ్రెస్ నే మొదటి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. అందుకే బీజేపీ ఇంకా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేయడంలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ కూడా టిక్కెట్లు ప్రకటించిన తర్వాతే బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెడుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీకి 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తిలను పార్టీలో చేర్చుకుని వారికి టిక్కెట్లు కేటాయించే వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు దీటుగా పోటీ ఇవ్వగలమేనే యోచన చేస్తోంది. ఈ ప్లాన్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలిమరి.