Etela Rajender latest news telugu(BJP news in telangana): ఈటల రాజేందర్ భార్య జమున ఓ ప్రెస్మీట్ పెట్టారు. తన భర్త హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. ఆగమేఘాల మీద ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించింది సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆయనకు రక్షణగా మోహరించింది. చాలా ఇంట్రెస్టింగ్గా లేదూ ఈ వ్యవహారం.
ఈటల కోరకుండానే.. ఎందుకింత వేగంగా కేంద్రం స్పందించినట్టు? భార్య ప్రెస్మీట్ పెట్టి అనుమానం వ్యక్తం చేస్తే.. ఏకంగా ఢిల్లీనే రంగంలోకి దిగేంత సీన్ ఉందా? మంత్రి కేటీఆర్ సైతం స్పందించారుగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు భద్రతకు కసరత్తు చేస్తోందిగా? అప్పటి వరకూ ఆగలేకపోయారా? ఇంత అర్జెంటుగా ఈటల రాజేందర్కు సీఆర్పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీ కల్పించాల్సినంత అత్యవసర పరిస్థితి ఉందా? ఎలాంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు లేకుండానే.. కేంద్రం ఇంతలా ఎందుకు రియాక్ట్ అయినట్టు? ధర్మపురి అర్వింద్ ఎంపీ కాబట్టి ఆయనకు వై కేటగిరీ భద్రత ఇచ్చారని అనుకున్నా.. కేవలం ఈటల భార్య ఆరోపణలు బేస్ చేసుకొనే.. ఓ ఎమ్మెల్యేకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అన్నిటికీ ఓ లెక్కుందా? అనే చర్చ నడుస్తోంది.
తెలంగాణ బీజేపీకి కింగ్ పిన్లా మారారు ఈటల రాజేందర్. ఇకపై పార్టీ ఆపరేషన్స్ అన్నీ ఈటలనే హ్యాండిల్ చేయనున్నారు. ఆయనకు అడ్డురాకుండా చూసేందుకే బండిని తప్పించారు. కిషన్రెడ్డిని డమ్మీగా నియమించారు. హోల్సేల్గా పార్టీ బాధ్యతలన్నీ రాజేందర్కే అప్పటించారని చెబుతున్నారు. ఎందుకంటే.. బీజేపీ లెక్క వేరే ఉందంటున్నారు.
బీజేపీని గెలిపించడమో, బీఆర్ఎస్ను ఓడించడమో కాదట.. కాంగ్రెస్ను దారుణంగా దెబ్బ తీయడమే.. ఈటలకు కాషాయ అధిష్టానం అప్పగించిన లేటెస్ట్ టాస్క్ అని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. గెలుపు ఓటములు అంత ప్రయారిటీ కాదని.. వచ్చే ఎన్నికల్లో ఈటక ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఆర్థికంగా, భద్రత పరంగా అండగా ఉంటామని చెప్పారని.. అందులో భాగంగానే.. ఇప్పుడిలా సీఆర్పీఎఫ్ కమెండోలతో.. వై ప్లస్ సెక్యూరిటీ అరేంజ్ చేశారని అంటున్నారు.
గతంలో చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటలను.. ఇప్పుడు కాంగ్రెస్లో చేరికలకు గండి కొట్టే పని అప్పగించారని తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలను గుర్తించడం.. వారితో టచ్లో ఉండటం.. వారిని బీజేపీలోకి ఆహ్వానించడం.. వారిని కన్విన్స్ చేయడం.. ఒప్పుకుంటే ఓకే.. లేదంటే కన్ఫ్యూజ్ చేయడం.. ఏదేమైనా కాంగ్రెస్ బలోపేతం కాకుండా చూసే బాధ్యతను కాషాయ అధిష్టానం ఈటలకు అప్పగించినట్టు సమాచారం.
ఈ విషయంలో ఇప్పటికే ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారని అంటున్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలను.. తొందరపడొద్దని సర్దిచెప్పే ప్రయత్నం ఈటల చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం స్థానిక బీజేపీ నేతలను కూడా ఈటల రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. అందుకే, చేరికల విషయంలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ పెరిగిందని అంటున్నారు. మరి, ఈటల చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు కలిసొస్తాయో? పొంగులేటి, జూపల్లిలనే అడ్డుకోలేక పోయిన కమలదళం.. కాంగ్రెస్లోకి వలసలకు అడ్డుకట్ట వేయగలుగుతుందా? ఆ బిగ్ టాస్క్ ఈటల వల్ల అవుతుందా? గన్మెన్లను వెంటేసుకు తిరిగితే.. స్థాయి, హోదా పెరిగుతుందా? ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టడం అంత ఈజీనా?