BJP Counter on TRS : మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కాషాయ పార్టీ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నానని.. కేసీఆర్ తప్పు చేయకపోతే ఆయన కూడా రావాలని సవాల్ విసిరారు బండి సంజయ్. యాదాద్రికి కేసీఆర్ రాకపోతే తప్పు చేసినట్లేనని అన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంతో బీజేపీపై బురద జల్లేందుకు టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకే గులాబీ పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు. ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్తనాటకానికి తెరతీశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని సర్వే తేల్చాయన్నారు. మొయినాబాద్ లో దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత? ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను ఎందుకు బయట పెట్టడంలేదని ప్రశ్నించారు. దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? కేసీఆర్ ఫాంహౌస్ నుంచి వచ్చిందా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్సే అనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. మొయినాబాద్ వ్యవహారంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై బీజేపీ నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని పిటిషన్ లో కోరారు. మొయినాబాద్ ఎపిసోడ్ పై టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టేందుకు బీజేపీ ఎదురుదాడి వ్యూహంతో ముందుకెళుతోంది.