BJP: “మోడీ కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరా. పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా. నేను పోటీ చేయడం, చేయక పోవడం పార్టీ నిర్ణయిస్తుంది. ఎటువంటి పదవులు ఆశించి బీజేపీలో చేరలేదు”. ఇదీ ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేటెస్ట్గా విజయవాడలో ప్రెస్మీట్ పెట్టి మరీ ఇచ్చిన క్లారిటీ. ఆయన చెప్పిన విషయాల్లో పెద్దగా ప్రత్యేకతలేమీ లేవు. జస్ట్ రొటీన్ స్టేట్మెంట్సే.
ఒకప్పుడు సమైక్యాంధ్ర ఛాంపియన్ ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం గట్టిగా నినదించారు. ప్రత్యేక తెలంగాణను అంతకంటే ఎక్కువగా వ్యతిరేకించారు. అయినా, రాష్ట్రం విడిపోయింది. తొమ్మిదేళ్లుగా నల్లారి న్యూస్లో లేకుండా పోయారు. అసలాయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఎవరూ తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కిరణ్కుమార్రెడ్డిని అంతా మర్చిపోయిన సందర్బంలో.. సడెన్గా నేనున్నానంటూ ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకుని మళ్లీ బ్రేకింగ్ న్యూస్గా మారారు. జనం మళ్లీ నల్లారి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
నల్లారి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం ఏంటి? అందులోనూ బీజేపీలో చేరడం ఏంటి? అనే చర్చ మొదలైంది. ఏపీ బీజేపీ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. పవన్ కల్యాణ్తో పొత్తు సైతం బెడిసికొట్టేలా ఉంది. సొంతంగా పోటీ చేస్తే ఈసారి కూడా ఒక్కసీటైనా వస్తుందో రాదో. ఇలాంటి సమయంలో ఏకంగా మాజీ సీఎంయే బీజేపీలో చేరడం మామూలు విషయం కానేకాదు. ఏపీ బీజేపీకి బిగ్ బూస్ట్.
నల్లారితో బీజేపీకి ఎంతోకొంత లాభం ఉండొచ్చు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారుగా అలా. అందులోనూ వైసీపీ, బీజేపీల మధ్య రహస్య స్నేహం నడుస్తోందంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. జగన్ కటకటాలు లెక్కించినప్పుడు సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం మరింత ఆసక్తికరం.
కిరణ్ కుమార్ రెడ్డి అంతగా జనాకర్షణ ఉన్న నాయకుడేమీ కాదు. ఆయన చేరినంత మాత్రాన ఏపీ బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. మరి, కిరణ్ కుమార్ రెడ్డికి ఏమైనా లాభమా? అంటే డౌటే. ఆయనేమీ ప్రముఖ పారిశ్రామిక వేత్త కాదు. ఆయన ఆస్తులపై ఈడీ, సీబీఐ దాడులు జరిగే ఛాన్స్ కూడా లేదు. మరి, నల్లారి ఎందుకు బీజేపీలో చేరినట్టు?
అయితే, నల్లారిని బీజేపీలో చేర్చుకోవడం వెనుక బీజేపీ వ్యూహం వేరే ఉందని అంటున్నారు. ఆయన్ను ఏపీ పాలిటిక్స్లో కాకుండా తెలంగాణ రాజకీయాల్లో పావుగా వాడుకోవాలనేది కాషాయం ఎత్తుగడ అని చెబుతున్నారు. మరి, అప్పట్లో కరుడుగట్టిన సమైక్యవాదిగా పేరున్న నల్లారి.. తెలంగాణలో బీజేపీకి అడ్వాంటేజ్ ఎలా అవుతారనే డౌట్ రావొచ్చు.
తెలంగాణ బీజేపీ రాజకీయమంతా కేసీఆర్ కుటుంబం అవినీతి, మజ్లిస్ పార్టీ చుట్టూనే తిరుగుతుంటుందనేది తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఫుల్గా కార్నర్ చేశారు. త్వరలోనే కేటీఆర్ గుట్టూ బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ను సైతం జైల్లో పెడతామని అంతకుముందే సవాల్ చేశారు. ఇక మిగిలింది మజ్లిస్ను కట్టడి చేయడం.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జగన్ జైలుకు వెళ్లడం మాత్రమే కాదు.. ఓవైసీ బ్రదర్స్ను జైల్లో పెట్టించిన క్రెడిట్ కూడా నల్లారి ఖాతాలో ఉంది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీలను జైలుకు పంపిన మొనగాడిగా అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. అందుకే, ఇక ముందుముందు MIMపై ప్రయోగించడానికే నల్లారిని ఆయుధంగా మార్చేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందనే చర్చ నడుస్తోంది. “పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా”.. అంటూ నల్లారి చెప్పిన డైలాగ్ వెనుక వ్యూహం ఇదేనంటున్నారు.
మరి, కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీకే పరిమితం చేస్తారా? లేదంటే, తెలంగాణలో మజ్లిస్ పార్టీపై మిస్సైల్గా ప్రయోగిస్తారా? చూడాలి…