Suicide : వరంగల్ లో ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బాలాజీనగర్కు చెందిన గంధం కుమారస్వామి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో కార్పొరేటర్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఎనుమాముల మాజీ సర్పంచి సాంబేశ్వర్ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. మాజీ సర్పంచి డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో కుమార స్వామి ఆరోపించారు. సాంబేశ్వర్ ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు. నమ్మినవారు తనను మోసం చేశారని ఆ వీడియోలో కుమారస్వామి విలపించారు.
తన భార్య, పిల్లలను వేధించవద్దంటూ కుమారస్వామి వేడుకున్నారు. వీడియోను మిత్రులకు, తోటి వ్యాపారులకు పంపించి ఇంట్లో ఉరేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య మరో గదిలో ఉన్నారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే కుమారస్వామి మరణించారని వైద్యులు తెలిపారు.
కుమారస్వామికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తన భర్త మృతికి కారకులైన సాంబేశ్వర్, ఆయన భార్య ప్రమీల, మరో వ్యక్తి కోట విజయ్కుమార్పై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారస్వామి గతంలో చిన్న పరిశ్రమల విభాగంలో ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు.