BJP-JANASENA : తెలంగాణలో జనసేనతో పొత్తుతో అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర బీజేపీ పార్టీ. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా జనసేనతో పొత్తు కుదుర్చకుంది. పొత్తులో భాగంగా జనసేనకు 9 నుంచి 11 స్ధానాలను కేటాయించాలని నిర్ణయించకుంది. దీనిపై పవన్ కల్యాణ్తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో సెటిలర్స్ అధికంగా ఉండే కూకట్పల్లి, శేరిలింగపల్లి, మల్కాజ్గిరి వంటి
స్ధానాల పై ఫోకస్ పెట్టింది జనసేన. ఆ నియోజవర్గాలను తమకు కేటాయించాలని కోరింది.
జనసేన అడిగిన సీట్ల విషయంలో సుదీర్ఘ కసరత్తే జరిగింది. కూకట్పల్లి, మల్కాజ్గిరి, శేరిలింగంపల్లి స్ధానాలను జనసేనకు ఇవ్వాలని అధిష్టానం భావించింది. అయితే అక్కడ స్ధానికంగా ఉండే బీజేపీ నేతల మాత్రం దీనికి ససేమేరా అంటున్నారు. జనసేన అడిగే కూకట్పల్లి, శేరిలింగంపల్లి స్ధానాలను ఆ పార్టీకి ఇవ్వొద్దని బీజేపీ లోకల్ క్యాడర్ గట్టిగానే తమ నిరసన గళాన్ని అధిష్టానానికి వినిపించింది.
కూకట్పల్లి సీటు జనసేనకు ఇస్తారనే నేపథ్యంలో.. ఇప్పటికే అక్కడ టికెట్ ఆశిస్తున్నవారు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా కూడా చేశారు.
ఇక శేరిలింగపల్లి టికెట్ విషయంలోను ఇదే పంచాయతీ నడుస్తోంది ఇరు పార్టీల మధ్య శేరిలింగంపల్లి స్ధానాన్ని తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీ అధిష్టానం సీటు ఇచ్చేందుకు సిద్దంగానే ఉన్నా.. అక్కడ లోకల్ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. దీంతో ఈ టికెట్ పై బీజేపీ పునారాలోచనలో పడింది. మరింత చర్చల తర్వాత ఈ సీట్ల పై క్లారిటీ ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అటు క్యాడర్.. ఇటు జనసేనతో ఉన్న మైత్రీ బంధాన్ని కాదనలేక, మల్లగుల్లాలుపడుతోంది కమలం పార్టీ.