Karimnagar Ticket Issue : తెలంగాణ బీజేపీలో ఎవరి పట్టు వారిదే. తమ వారికే టిక్కెట్లు ఇప్పించుకోవడం ద్వారా అనుచర బలగాన్ని పెంచుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారా..? టిక్కెట్ల రూపంలో పంతం నెగ్గించుకుంటున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. బీజేపీలో ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాలుగా ఉన్నాయి. ఇందులో వీరు తమ వారికే టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం చాలా పట్టు పట్టారు.
బీజేపీ సైద్ధాంతిక పార్టీ. పెద్దగా గ్రూప్లు ఉండవు. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో కమలం పార్టీలో కూడా గ్రూప్లు పెరిగిపోయాయి. ఎన్నికల సమయంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తమ అనుచరులకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ.. హైకమాండ్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొదటి జాబితాలో వచ్చే పేర్లను నాలుగో జాబితా వరకు తీసుకొచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు.. ఈటల రాజేందర్, బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఈ ఇద్దరు నేతలు అనుకున్నది సాధించుకున్నారు.
అసలే తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్, బండి సంజయ్, అర్వింద్, లక్ష్మణ్, రాజాసింగ్ వంటి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో వారంతా తమకు అనుకూలంగా ఉన్న వారికే టిక్కెట్లు ఇప్పించుకునేందుకు పోటీ పడ్డారు. తమవారినే బరిలో దింపడం ద్వారా పార్టీలో పట్టు సాధించుకునే వ్యూహాలు రచించారు. అందుకే బీజేపీ లిస్టు చాలా ఆలస్యమైందన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సీట్లలో ఎవరిని ఎంపిక చేయాలన్నది కమలం హైకమాండ్ కు పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఈటల, బండి ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, హుస్నాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఒక పట్టాన తేలలేకపోయింది.
ఈ రెండు సెగ్మెంట్లలో బీజేపీ బలంగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిపోయింది. వేములవాడలో మెజారిటీ సాధించింది. ఇక్కడ ఈటల అనుచరురాలు తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఇందుకు బండి సంజయ్ మద్దతు ఇచ్చారు. చివరకు ఈటల చెప్పిన తుల ఉమకే హైకమాండ్ టిక్కెట్ కన్ఫామ్ చేయాల్సి వచ్చింది. అటు హుస్నాబాద్ విషయంలో బండి, ఈటల ఇద్దరూ పట్టుబట్టారు. ఈటల అనుచరులు సురేందర్ రెడ్డి,, అలాగే బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ టికెట్ పోటీ పడ్డారు. తమ అనుచరులకే టికెట్ల ఇవ్వాలంటూ ఈ ఇద్దరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. వేములవాడ, హుస్నాబాద్ లో ఏ ఒక్క చోటులోనే అభ్యర్థి పేరు చెప్పాలని మరో సెగ్మెంట్ను వదులుకోవాలని హైకమాండ్ సూచించింది. దీంతో ఈటల వేములవాడలో తాను చెప్పిన తుల ఉమకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. అటు హుస్నాబాద్ లో బండి సంజయ్ చెప్పిన బొమ్మ శ్రీరామ్కు టికెట్ ఇచ్చారు. చెరో.. టికెట్ ఇవ్వడంతో అసమ్మతి కూడా కాస్త తగ్గింది. కానీ కమలం పార్టీలో కొత్త టెన్షన్లు మొదలయ్యాయంటున్నారు.
వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు టికెట్ వస్తుందని అంతా ఊహించారు. పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే చర్చ సాగింది. కానీ రాజేందర్ అందుకు ఒప్పుకోలేదు. తుల ఉమకు ఇవ్వాలని పట్టుబట్టారు దీంతో చివరి నిమిషంలో తుల ఉమకు ఇచ్చారు. హుస్నాబాద్ లో అసంతృప్తికి గురైన సురేందర్ రెడ్డిని ఈటల బుజ్జగిస్తున్నారు. బిజెపిలో గతంలో టికెట్ల కోసం ఇంత ఒత్తిడి లేదు. అయితే ఇప్పుడు మాత్రం తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకొని.. పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వేములవాడలో మాత్రం.. వికాస్ రావు కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలని హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆందోళన కూడా చేసిన పరిస్థితి.
ఈ టిక్కెట్ల పంచాయితీతో ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయిందంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి తప్పుకున్న తరువాత ఇంకా దూరం దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా.. బీసీ సిఎం అని బిజెపి ప్రకటించడంతో తమ అనుచరులకే టికెట్ ఇప్పించుకునేందుకు ప్లాన్ చేశారు. ఇందులో ఇద్దరు నేతలు సక్సెస్ అయ్యారు. పట్టుబట్టి ఇప్పించుకున్న నేతలు ఎన్నికల్లో గెలుస్తారా ఓడుతారో చూడాలి. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తున్నామని.. తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ ఇద్దరు నేతలు బయటకు చెబుతున్నారు.