BJP : తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ కసరత్తు కొనసాగిస్తోంది. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో దాదాపు అన్ని సీట్లపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో 50 నుంచి 60 సీట్లకు బీజేపీ సీఈసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
అటు బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ పైనా సస్పెన్షన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు గోషామహల్ టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోనే 3 రాష్ట్రాల అభ్యర్థుల జాబితాల విడుదల చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో కేసీఆర్ 119 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులకు బీ ఫామ్స్ కూడా ఇచ్చేశారు. మరోవైపు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే సిరిసిల్లి, సిద్ధిపేట లాంటి కీలక నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఇలా గులాబీ బాస్ ఎన్నికల రణరంగంలో తనదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్న పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచారు. ములుగు, పెద్దపల్లి బహిరంగ సభల్లో కాంగ్రెస్ ప్రకటించిన హామీలతో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తోంది. కాషాయ పార్టీ ప్రచారంలో వెనుకబడింది.