తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయిన్ల జాబితాను విడుదల చేసింది. అయితే.. ఆ లిస్టులో పార్టీ మహిళా నాయకురాలు విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్లను పక్కన పెట్టి అవమానించింది. ఆ తర్వాత విజయశాంతిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారన్న విమర్శలతో.. రాములమ్మ పార్టీ వీడుతారేమో అన్న కారణంతో మళ్లీ మార్పులు చేస్తూ మరో జాబితా విడుదల చేసింది. విజయశాంతి, రఘునందన్రావుల పేర్లను కూడా చేర్చి మొత్తం 42 మంది ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
ఎన్నికల వేళ విజయశాంతిని విస్మరించడం పొలిటికల్గా చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె.. కాంగ్రెస్లో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారని.. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. కొంతకాలంగా ఆమె మౌనంగా ఉండటంతో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే పుకార్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పక్కకు పెట్టి.. చర్చల అనంతరం మళ్లీ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.